మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. ఈ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్లోని తన కార్యలయంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమీషనర్ పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ , జిఎం అశ్విన్కుమార్ గుప్తా, రాష్ట్ర రైసుమిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా స్థాయి రైసు మిల్లర్ల అసోసియేషన్ నిర్వహకులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వానకాలం 2020-21 వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న రకాలు పండించారన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 6,491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ‘ ఇప్పటి వరకు 3074 కేంద్రాలను ఏర్పాటు చేసి 4.23 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని మంత్రి గంగుల తెలిపారు. ఇప్పటివరకు 93 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలను, 3.30 మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అకాల వర్షాల వలన సన్న రకాలకు దోమపోటుతో ధాన్యం రంగు మారిందని, ఈ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల సమస్యలపై ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ తో మాట్లాడి రవాణ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు సన్న రకాలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రైతు తాలు, టప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు రావాలని కోరారు. సిఎం ఆదేశాల మేరకు సన్నరకాలకు క్వింటాళుకు రూ. 1888 చెల్లిస్తుందని పేర్కొన్నారు.