Saturday, April 27, 2024

బిసిలకు గులాబీ పార్టీ పెద్దపీట

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బిఆర్‌ఎస్ దన్ను
పార్టీ ముఖ్యనేతలతో చర్చించి.. ఆచి తూచి నిర్ణయం తీసుకున్న అధినేత కెసిఆర్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గులాబీ బాస్
అభ్యర్థుల ఎంపికలో సర్వత్రా హర్షం
బిఆర్‌ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితిగా నిలిచిందని రాజకీయ విశ్లేషకుల కితాబు

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బిఆర్‌ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బిసిలకు పెద్దపీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్నుగా నిలిచిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచింది. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వుడు స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మినహా ఇప్పటికే 16 స్థానాలను బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అధ్యక్షుడు కెసిఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులతో వరుసగా చర్చలు జరిపి సమష్టి నిర్ణయంతో అభ్యర్థులను కెసిఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 5 రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి.

వాటిల్లో రెండు ఎస్‌టి రిజర్వ్ స్థానాలుండగా, వాటిలో ఒకటి లంబాడ మహిళకి (మహబూబాబాద్) కేటాయించగా, మరో స్థానాన్ని (ఆదిలాబాద్) ఆదివాసి వర్గానికి బిఆర్‌ఎస్ అధినేత కేటాయించారు. అలాగే మూడు ఎస్‌సి రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో ..రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకు (నాగర్ కర్నూల్, వరంగల్) కేటాయించగా..పెద్దపెల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించారు. ఇవి పోగా.. ప్రకటించిన మిగతా 11 స్థానాల్లో 5 స్థానాలను బిసిలకు కేటాయించి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. బిసిలకు కేటాయించిన స్థానాలలో రెండు స్థానాలను మున్నూరు కాపులకు(జహీరాబాద్, నిజామాబాద్), ఒక స్థానాన్ని ముదిరాజ్ (చేవెళ్ల)లకు, ఒకటి గొల్ల కుర్మలకు(భువనగిరి), ఒక స్థానాన్ని (సికింద్రాబాద్) గౌడ్ సామాజిక వర్గాలకు కేటాయించి..పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలు పరచడంలో బిఆర్‌ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమవుతుంది. కాగా, హైదరాబాద్ నుంచి పోటీలో బిసి అభ్యర్థినే అధినేత ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ స్థానం కూడా బిసిలకే ఖరారైతే..రిజర్వుడ్ పోగా మిగిలిన 12 సీట్లల్లో 6 సీట్లు అంటే 50 శాతం బిసిలకే కేటాయించినట్లు అవుతుంది. కాగా, ఎస్‌సి,ఎస్‌టి రిజర్వుడ్ పోగా మిగిలిన 12 స్థానాల్లో ఒసిలకు 6 సీట్లను కేటాయించారు. వాటిలో నాలుగు రెడ్డి సామాజికవర్గానికి కేటాయించగా, ఒకటి కమ్మ సామాజికవర్గానికి, ఒకటి వెలమ సామాజిక వర్గానికి బిఆర్‌ఎస్ పార్టీ కేటాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News