మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో రూ.12 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేసిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు సినీఫక్కీలో మొబైల్ ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్ను అపహరించారు. తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబూరు నుంచి కంటైనర్ ముంబై బయలుదేరింది. కాగా షియోమీ సంస్థ గోదాముకు నుంచి సెల్ఫోన్ల లోడుతో ఉన్న లారీ ఎపి సరిహద్దులోకి నగరికి రాగానే ఆ లారీని మరో లారీతో ఓవర్టెక్ చేసి అగంతకులు గన్తో డ్రైవర్ను బెదిరించారు. అనంతరం డ్రైవర్ కాళ్లు, చేతులు కట్టేసి సెల్ఫోన్ల లోడ్తో ఉన్న లారీతో పరారయ్యారు.
ఈక్రమంలో మొబైల్స్ను వేరే లారీలోకి మార్చుకుని దొంగతనానికి ఉపయోగించిన లారీనీ అక్కడే వదిలేశారు. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్లో దాదాపు రూ. 12 కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్స్ ఉన్నట్లు సమాచారం. అందులో 16 బాక్స్లు ఉండగా 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. కంటైనర్లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి. బాధితుడు ఇక్బాల్ నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తుపాకీ గురిపెట్టి తనను కొట్టి దుండగులు లూటీకి పాల్పడినట్టు బాధితుడు ఇక్బాల్ మీడియాకు వెల్లడించాడు.అయితే, ఆ లారీని నగరి సమీపంలోని హైవేపై వదిలినట్టు పోలీసులు గుర్తించారు. మొబైల్ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని నగర పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలో డ్రైవర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Rs 12 cr worth of Mobile phones stolen in AP