Tuesday, May 14, 2024

‘మంచినీళ్ళ’ సంబురం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచినీళ్ళ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు గ్రామాల్లో తమ ఇళ్ళ ముందు,మంచినీటి ట్యాంక్‌ల వద్ద, ఇంటెక్ వల్ వద్ద రంగురంగుల ముగ్గులను వేసి మీషన్ భగరథకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానికులు మంచినీటి ట్యాంక్‌లను, ఇంటెక్ వెల్‌ను, మంచినీటి శుద్ది కేంద్రాలను మంచి నీళ్ళ పండగ సందర్భంగా పరిశీలించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ఖమ్మం నగరంలోని రమణగుట్ట, స్తంభాద్రి నరసింహాస్వామి దేవాలయం వద్ద నిర్మించిన ఇఎల్‌ఎస్‌ఆర్ లను నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి ప్రారంభించారు.కొణిజర్ల మండలం తనికెళ్ళ ముక్రి హిల్స్ స్ధానిక ఎమ్మెల్యే లావుడ్యా రాముల నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంచినీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ఖమ్మం నగరంలోని స్తంభాద్రి నరసింహస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ, గతంలో బిందె పట్టుకొని రోడ్డుపై త్రాగునీటికి కోసం మైల దూరంలో నడవాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇంటి వద్దనే నల్లా ద్వారా త్రాగునీటిని నగరాల్లో రోజు విడిచి రోజు, గ్రామాల్లో ప్రతిరోజు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఖమ్మం నగరంలో ఏడు ట్యాంకులు ఉండేవని, గత రెండు రోజుల్లో 9 కొత్త ట్యాంకులను ప్రారంభించుకున్నామని, జూన్ చివరికల్లా దాదాపు అన్ని ట్యాంకులు పూర్తయి ప్రారంభించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఎత్తైన ప్రాంతాల్లో ట్యాంకుల నిర్మాణం చేపట్టినందున గ్రావిటీ ద్వారా మంచి ప్రెషర్ తో నీరు అన్ని ప్రాంతాలకు అందుతుందని, నీటి సమస్య ఉండదని ఆయన అన్నారు. గతంలో నీరు ఎప్పుడు వదులుతారా అని ఎదురుచూసేవారమని, ఇప్పుడా సమస్య ఎక్కడా లేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్యాoకుల పనుల పురోగతిని, ఏ ట్యాంకు ద్వారా ఏ ఏ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్నది, ట్యాంకు నిర్మాణం పూర్తి కానిచోట ఏ విధంగా త్రాగునీటిని సరఫరా చేస్తున్నదని అధికారులు మ్యాప్ ద్వారా కలెక్టర్, మేయర్‌లకు వివరించారు.

కలెక్టర్ గౌతమ్ మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరమని, శుద్ధి చేసిన నాణ్యమైన నదీ జలాలను ప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచినీళ్ళ పండగను పురస్కరించుకుని కూసుమంచి మండలం జీళ్ళచెరువు మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ళ పండుగ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 34 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల అన్ని ఆవాసాలకు శుద్ధమైన త్రాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో 900 వాటర్ ట్యాoకులు ఉండేవని, 3 సంవత్సరాలలోనే 300 కొత్త వాటర్ ట్యాoకులు నిర్మించుకున్నామన్నారు. ప్రతి మారుమూల ప్రాంతానికి సహా త్రాగునీరు రోజు సరఫరా అవుతుందన్నారు. గతంలో ప్రతి వేసవికాలం త్రాగునీటికి వేసవి కార్యాచరణ ప్రణాళిక చేసి, తాత్కాలిక నీటి సరఫరా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేదని, ఇప్పుడు త్రాగునీటికి ఏ సమస్యలు లేవన్నారు. గతంలో త్రాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, ఇప్పుడు ఎక్కడా ధర్నాలు లేవని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి టర్మ్ లోనే త్రాగునీటి సమస్య తీర్చడానికి మిషన్ భగీరథ చేపట్టి, పూర్తి చేసిందని ఆయన అన్నారు.

అంగన్వాడీలు, అన్ని బడులు, కెజిబివిలు, గురుకులాల్లో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఐడిఓసి లో మిషన్ భగీరథ నీటిని త్రాగుతున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ త్రాగునీరు వచ్చినప్పటి నుండి ఫుడ్ పాయిజన్, టైఫాయిడ్, కలరా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, త్రాగడానికి గుక్కెడు నీటికోసం తపించిన తెలంగాణ లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించడం అద్భుతమని అన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి మంచి నీరు, ఫ్లోరైడ్ రహిత నీరు అందించడానికి ముఖ్యమంత్రి ఆలోచించి మిషన్ భగీరథ పథకం తెచ్చారన్నారు. వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లోని కొండల మీది కోయలకు మిషన్ భగీరథ నీరు అందుతున్నదని ఆయన తెలిపారు.

గతంలో కావేడ్లు ద్వారా నీరు తెచ్చుకునేవారని, బిందెలతో బోరింగ్‌ల వద్ద కొట్లాటలు జరిగేవాని, ఇప్పుడు ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దే ట్యాప్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేసవి కాలంలో గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు, నిరసనలు ఉండేవని, నేడు అటువంటిది ఎక్కడా కన్పించడంలేదన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ సమయంలో చిన్న, చిన్న ఇబ్బందులు వస్తాయని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. పట్టణీకరణలో భాగంగా ఏర్పడుతున్న క్రొత్త హాబీటేషన్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు.

వారానికి ఒక పాఠశాల పిల్లలను గ్రిడ్ సందర్శన చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు గ్రిడ్ ను సందర్శించి నీటి శుద్దీకరణ, సరఫరా ప్రక్రియను పరిశీలించారు. మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్ వారికి నీటి శుద్ది ప్రక్రియ అంచెలను చూపిస్తూ, అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్, పాలేరు నియోజకవర్గ మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, డిసిసిబి డైరెక్టర్, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం నగర కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్యా నాగరాజు, కర్నాటి కృష్ణ, కరుణ, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, డిఇలు నవీన్, నవ్య జ్యోతి, ఎఇలు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News