Saturday, May 4, 2024

సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు శివ కుమార్ శర్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Shiv Kumar

ముంబై : సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు, మ్యూజిక్ కంపోజర్ పండిట్ శివ కుమార్ శర్మ ముంబైలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో ఆకస్మికంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

పండిట్ శివ కుమార్ శర్మ  మన దేశంలో అత్యంత సుప్రసిద్ధులైన సంప్రదాయ సంగీతకారుల్లో ఒకరు. ఆయన వచ్చే వారం భోపాల్‌లో ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ఈలోగానే ఆయనకు గుండెపోటు రావడంతో అందరికీ దూరమయ్యారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన కుటుంబ సభ్యులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మంగళవారం ఉదయం ఆయనకు తీవ్రమైన గుండె పోటు వచ్చిందని చెప్పారు. ఆయనకు నిత్యం డయాలసిస్ జరుగుతూ ఉండేదని, అయినప్పటికీ ఆయన చాలా చురుగ్గా ఉండేవారని చెప్పారు. వచ్చే వారం ఆయన భోపాల్‌లో ప్రదర్శన ఇవ్వవలసి ఉందని, ఈ లోగానే ఈ విధంగా తమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

పండిట్ శివ కుమార్ శర్మ 1938లో కశ్మీరులో జన్మించారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. జమ్మూ-కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు ఆయనే కావడం విశేషం.

పండిట్ శివ కుమార్ శర్మ సుప్రసిద్ధ వేణు నాద సంగీతకారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘సిల్సిలా’, ‘లమ్హే’ , ‘చాందిని’ వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. పండిట్ శివ కుమార్ తనయుడు రాహుల్ శర్మ కూడా సంతూర్ వాద్యకారుడే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News