Saturday, April 27, 2024

ఇకపై భారీగా బొగ్గు రవాణా

- Advertisement -
- Advertisement -
SCCL achieves 68 percent growth in coal transport 
దేశ అవసరాల రీత్యా రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా
 సింగరేణి ఛైర్మన్, ఎండి ఎన్ శ్రీధర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ అవసరాల రీత్యా ఇకపై రోజుకు రెండు లక్షల ఏడువేల టన్నుల బొగ్గు రవాణా చేయనున్నట్లు సింగరేణి సంస్థ సిఎండి శ్రీధర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అక్టోబరుతో ముగిసిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోల్చితే రికార్డు స్థాయిలో 68 శాతం వృద్ధితో బొగ్గు రవాణా, 60 శాతం వృద్ధి తో బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. తమతో ఇంధన సరఫరా ఒప్పందం గల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా సరఫరా చేయగలిగామన్నారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల తో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల రీత్యా ప్రతి ఏరియా నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, ఈ ఏడాది సింగరేణి చరిత్ర లోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు జరపాలని, లాభాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి రోజూ 40 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 218 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేయగా ఈ ఏడాది తొలి 7 నెలల కాలంలో 68 శాతం వృద్ధి తో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. తద్వారా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా రవాణా చేశామన్నారు. గత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో 220 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయ గా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 60 శాతం వృద్ధితో 352 లక్షల బొగ్గును ఉత్పత్తి చేశామన్నారు. గతేడాది ఇదే కాలానికి సాధించిన 156 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఒబిపై 28 శాతం వృద్ధి తో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 201 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఒబిని తొలగించామన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న ఐదు నెలల కాలంలో కూడా రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తూ తమతో ఇంధన సరఫరా ఒప్పందం గల అన్ని సంస్థలకు ఎటువంటి కొరతా లేకుండా బొగ్గు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఐదు నెలల కాలంలో 330 లక్షల టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేయడంతో పాటు అదే పరిమాణంలో బొగ్గును రవాణా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఈ మేరకు ఏరియాల వారీగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టడానికి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ లో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణ, అడ్వైజర్ (మైనింగ్) డిఎన్.ప్రసాద్, ఇడి (కోల్ మూమెంట్) జె. అల్వి న్, జిఎం (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, ఆయా ఏరియాల జిఎంలు, కార్పోరేట్ జిఎంలు పాల్గొన్నారు.

దీపావళి శుభాకాంక్షలు

ఏరియా జిఎంలతో సమీక్షలో సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులకు శ్రీధర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల తో ఆనందోత్సాహాలతో, రక్షణతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News