మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మూడవ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టింగ్ చేసేందుకు గడువు బుధవారం(అక్టోబర్ 28)తో ముగియనుంది. అయితే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీటు రద్దవుతుంది. దోస్త్ కౌన్సెలింగ్లో భాగంగా తాము కోరుకున్న కళాశాలల్లో కోరుకున్న సీట్లలో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుని సీట్లు కేటాయించబడిన విద్యార్థులు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ సరైన అవవగాహన లేక తమ సీట్లను కోల్పోతున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో దోస్త్ ప్రవేశాలు పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు మంగళవారంతో ముగియగా, ఈ నెల 31వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 5వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఇప్పటివరకు వివిధ విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 5 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక విడతతో పాటు వివిధ విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి గడువులోగా కళాశాలల్లో తమ సీటును నిర్ధారించుకోకపోతే దోస్త్లో కేటాయిచిన సీటు రద్దవుతుంది.
వృత్తి విద్యా కోర్సుల కౌన్సెలింగ్ తర్వాత మరో విడత.?
ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ఇంటర్ అర్హతతో చేరే ఇతర వృత్తి విద్యా కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మరో విడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు లభించని విద్యార్థులతో పాటు నాలుగు విడతల్లో సీట్లు పొందని విద్యార్థులు మరోసారి నిర్వహించే ప్రత్యేక విడతలో వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎంసెట్, డిఇఇసెట్, పిఇసెట్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో తమ ర్యాంకులకు సీట్లు లభించక కొంతమంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారికి అవకాశం కల్చించేలా మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా మిగిలిన సీట్లకు మాత్రమే తర్వాత విడత కౌన్సెలింగ్ ఉంటుంది.