Monday, April 29, 2024

15 రోజుల సమయమివ్వండి

- Advertisement -
- Advertisement -

అదానీహిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంను కోరిన సెబీ

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ తన స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ముగించేందుకు మరో 15 రోజుల సమయం కావాలని సోమవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీం కోర్టును కోరింది. తాజాగా సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒక దరఖాస్తులో ‘హిండెన్‌బర్గ్‌అదానీ కేసుకు సంబంధించిన 24 అంశాలపై విచారణ జరుపుతున్నాం’ అని తెలిపింది.

ఈ 24 అంశాల్లో 17 విషయాలపై విచారణ జరిపి, పూర్తి చేశామని రెగ్యులేటర్ వివరించింది. మిగతా అంశాలపై వివిధ ఏజెన్సీలను సంప్రదించి వివరాలను కోరామని, వాటికి సమయం అవసరమని సెబీ తెలిపింది. ఆగస్టు 29 నాటికి పూర్తి అంశాలపై దర్యాప్తు వివరాలను సమర్పించనున్నట్టు సెబీ వెల్లడించింది. మార్చి 2న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో కమిటీని ఏర్పాటు చేయగా సెబీకి దర్యాప్తు చేసేందుకు 2 నెలల సమయం కూడా ఇచ్చింది. మార్కెట్ రెగ్యులేటర్ తన నివేదికను మే 2లోగా సమర్పించాల్సి ఉంది. అయితే సెబీ తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా విచారణ కోసం ఆరు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే 6 నెలల సమయం ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసు దర్యాప్తు నివేదికను మే 19న సుప్రీంకోర్టు కమిటీ వెల్లడించింది. అదానీ షేరు ధరను తారుమారు చేయడం వెనుక సెబీ వైఫల్యం ఉందని ఈ దశలో తేల్చలేమని కమిటీ పేర్కొంది. గ్రూప్ కంపెనీల్లో విదేశీ నిధులపై సెబీ విచారణ అసంపూర్తిగా ఉందని కమిటీ పేర్కొంది. అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 13 విదేశీ ఫండ్స్ ప్రమోటర్లతో సంబంధాలు కలిగి ఉండవచ్చని సెబీ అనుమానిస్తున్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News