Sunday, April 28, 2024

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సూలె, ప్రఫుల్ పటేల్

- Advertisement -
- Advertisement -

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సూలె, ప్రఫుల్ పటేల్
పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన శరద్ పవార్
అజిత్ పవార్‌ను పక్కన పెట్టిన అధినేత

ముంబయి: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ పార్టీ బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కొత్తగా ఇద్దరిని కార్య నిర్వాహక అధ్యక్షులను ప్రకటించారు. అయితే ఇందులో కీలక నేత అజిత్ పవార్‌కు చోటు దక్కకపోవడం విశేషం. తన కుమార్తె సుప్రియా సూలె, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవంసందర్భంగా ముంబయిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ఈప్రకటన వెలువడడం గమనార్హం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలెకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళలు, యూత్, లోక్‌సభసమన్వయ బాధ్యతలను అపగించారు. ప్రఫుల్ పటేల్ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. జార్ఖండ్, గోవా, రాజ్యసభ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన పేరును ప్రకటించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయినట్లుగా కనిపించిన అజిత్‌పవార్ ఈ ప్రకటన వెలవడిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే పార్టీ కార్యాలయంనుంచి వెళ్లిపోయారు.

కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రఫుల్ పటేల్ శరద్ పవార్ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించిందని అంటూ, పార్టీ కోసం ఇకపై కూడా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. ప్రఫుల్ పటేల్‌తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనపై ఇంతటి పెద్ద బాధ్యతలను ఉంచిన పవార్ సాహెబ్‌కు, పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు సూలె ఒక ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు మిగతా సహచరులతో కలిసి రాబోయే రోజుల్లో కూడా పని చేస్తాననిఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతో పాటుగా సుప్రియా సూలెను పార్టీ కేంద్ర ఎన్నిక అథారిటీ చైర్‌పర్సన్‌గా కూడా నియమించారు.

కాగా ఎన్‌సిపి అధ్యక్షుడిగా వైదొలగుతున్నట్లు పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ కమిటీ వ్యతిరేకించింది.ఆయన రాజీనామాను తిరస్కరించింది. అధినాయకత్వ బాధ్యతల్లో కొనసాగాలని పార్టీ కోరింది. దీంతో మనసు మార్చుకున్న పవార్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే పవార్ రాజీనామా సమయంలో అజిత్ పవార్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ శరద్ పవార్ వెనక్కి తగ్గడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. అనంతరం పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అజిత్ పవార్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తారంటూ మళ్లీ ఊహాగానాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా అజిత్ పవార్‌ను పక్కన పెట్టి సూలె, ప్రఫుల్ పటేల్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అజిత్ ట్వీట్
కాగా ఈ పరిణామాలపై అజిత్ పవార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నూతనంగా నియమితులయిన వర్కింగ్ ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శరద్‌పవార్ నాయకత్వంలో ఎన్‌సిపిసిల్వర్ జూబ్లీలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రం, ఈ దేశ ప్రజలకోసం మా విలువైన సహకారాన్ని మరింతగా అందిస్తాం. ఈ లక్షం కోసం పార్టీలోని ప్రతి కార్యకర్త, నేత పని చేస్తారని ఆశిస్తున్నా. కొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక అధ్యక్షులకు అభఙనందనలు’ అని శరద్‌పవార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News