Monday, May 6, 2024

అదరహో… ఆకాశ వంతెన

- Advertisement -
- Advertisement -
వందేళ్లు వర్ధిల్లేలా ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం
దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణం
నేడు మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం
అందుబాటులో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కీలేటర్లు
ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెయిల్, విశాఖ స్టీల్ లతో పాటు జిందాల్ స్టీల్ వినియోగం

మనతెలంగాణ/హైదరాబాద్:జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదాచారుల రక్షణ కోసం నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ నేడు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు….
రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదాచారుల వంతెన (ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగిందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు మంత్రి సూచించారు. దీంతో ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి ఈ ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. వారు రూపొందించిన కొన్ని నమూనాల నుంచి పాదాచారుల వంతెన డిజైన్‌ను ఎంపిక చేసి దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్‌ఎండిఏ చేపట్టింది.

ఎస్‌ఏఐఎల్, వైజాగ్ స్టీల్, జిందాల్ స్టీల్‌ల వినియోగం
ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డును దాటే (రోడ్డు క్రాసింగ్) సమయంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాల్లో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పాదచారుల వంతెన ( స్కైవాక్ లేదా బోర్డు వాక్) నిర్మాణం శ్రేయస్కారమని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండిఏకు అప్పగించింది. దీని నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐఎల్), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తో పాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను దీనికోసం వినియోగించామని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వాడి దీనిని పూర్తి చేశారు.

స్కైవాక్ విశేషాలు..
రామంతాపూర్,- బోడుప్పల్ రోడ్డు, హబ్సిగూడ-, ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ ఈ పాదాచారులు వంతెన నుంచి అన్ని వైపులా వెళ్లేందుకు వీలుగా ఈ జంక్షన్ చుట్టూ సర్కిల్ ఆకారంలో స్కై వాక్ రానుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు సైతం దీనిని కనెక్టివిటీ చేయనున్నారు.
-ఆధునిక హంగులతో నిర్మించే ఈ ఎలివేటెడ్ వాక్ వే నిర్మాణానికి రూ. 98.50 కోట్ల మేర ఖర్చు అయ్యింది. -స్కైవాక్ పొడవు 660 మీటర్లు, వాటి వెడల్పు 4 మీటర్లు, ఎత్తు 8.15 మీటర్లుగా నిర్మించారు. లిఫ్ట్ సౌకర్యం, ఎస్కలేటర్స్, కియోస్క్, షాపులు తదితర మౌలిక వసతులు ఇక్కడ కల్పించారు. -రెండు విడతలుగా దీని నిర్మాణ పనులను చేపట్టనున్నారు. స్టేట్ 1లో స్కైవాక్ లిస్ట్, ఎస్కలేటర్స్, ఫలింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ ఫిట్టింగ్, ల్యాండ్ స్కేపింగ్, స్టేజ్-2లో స్కై వాక్ రూఫ్ (పాదాచారులకు ఎండ, వాన బారిన పడకుండా) దీనికి రూపకల్పన చేశారు.

కరోనాతో ప్రాజెక్టులో జాప్యం…
పాదాచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కీలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. దీని నిర్మాణానికి మొత్తం 37 పిల్లర్లను వినియోగించారు. మూడు, నాలుగు, అరు మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుంచి అరు మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం జరిగింది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన ఈ పాదాచారుల వంతెన (ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్‌ను ఏర్పాట్లు చేశారు. 2020 ఏడాది చివరలో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో 90 శాతం మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండడం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.

ప్రతినిత్యం 20 వేలమందికి పైగా…
ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదాచారులు రోడ్డు క్రాసింగ్ చేస్తుంటారు. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్‌ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్‌ఎండిఏ అర్భన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచుతుండడంతో ఆయా పరిసరాలు పచ్చదనంతో మరింత శోభను సంతరించుకున్నాయి.

నేడు కన్వేన్షన్ హాల్ సైతం ప్రారంభం
ఉప్పల్ మినీ శిల్పారామం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కన్వేన్షన్ హాల్‌ను మంత్రి కెటిఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ కన్వేన్షన్ హాల్ 160*100 సైజులో 1000 మంది కూర్చునేలా దీని నిర్మాణం జరిగింది. దీంతోపాటు లాన్, కిచెన్ సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికోసం హెచ్‌ఎండిఏ సుమారుగా రూ.10 కోట్లను కేటాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News