హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలోని (ఎస్సీఆర్)లో నడిచే 72 రైళ్లకు త్వరలో రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడంతో దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. వీటివల్ల ఇతర రైళ్లు, గూడ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఎస్సీఆర్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్, గుంతకల్లు డివిజన్లో సుదీర్ఘకాలం సేవలందించాయి. సబర్భన్ సర్వీసులుగా ఉన్న డెమూ, మెమూ రైళ్లను పూర్తిగా తీసివేసి వాటి స్థానంలో మల్టీమోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం (ఎంఎంటిస్) రైళ్లను నడపనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ నెలలో రైళ్ల టైంటేబుల్లో భారీ ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు 47 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఎస్సీఆర్ పరిధిలో రోజుకు 876 రైళ్లు రాకపోకలు
ఎస్సీఆర్ పరిధిలో రోజుకు 876 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి సాధారణ, సూపర్ఫాస్ట్ రైళ్లు కలిపి 120, హైదరాబాద్ నుంచి 50, కాచిగూడ నుంచి 70, లింగంపల్లి నుంచి 30 రైళ్లు నడుస్తాయి. ఇలా రోజుకు సగటున 1.80 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటికి తోడు 128 ఎంఎంటిఎస్ సర్వీసులు, 30కి పైగా డెమూ రైళ్లు మరో 1.95 లక్షల మంది ప్రయాణికులు వారి వారి ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. లాక్డౌన్కు ముందు ఈ రైళ్లన్నీ 24 గంటల పాటు రాకపోకలు సాగించేవి. లాక్డౌన్ సమయంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. జూన్ 10వ తేదీ నుంచి పరిమితంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర రైళ్లు, ఎక్స్ప్రెస్లు, గూడ్స్ల వేగాన్ని పెంచేందుకు 72 రైళ్లను రద్దు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.
రద్దు కానున్న రైళ్లు ఇవే…
తిరుపతి టు పాండిచ్చేరి, విజయవాడ టు తెనాలి, తెనాలి టు గుంటూరు, విజయవాడ టు తెనాలి, విజయవాడ టు గుంటూరు, గుంటూరు టు ఒంగోలు, గుంటూరు టు విజయవాడ, రాజమండ్రి టు భీమవరం, భీమవరం టు నిడదవోలు, మణుగూరు టు కాజీపేట, ఫలక్నుమా టు భువనగిరి, కలబర్గీ జంక్షన్ టు హైదరాబాద్ డెక్కన్, కాజీపేట టు విజయవాడ, విజయవాడ టు పెద్దపల్లి, నంద్యాల టు హెచ్ఎక్స్ స్పెషల్, గూడూరు టు రేణిగుంట జంక్షన్, డోన్ టు గుంతకల్, నిజామాబాద్ టు బోధన్, మీర్జాపల్లి టు బోధన్, ఫలక్నుమా టు ఉందానగర్ (డెమూ), ఉందానగర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు మేడ్చల్, మేడ్చల్ టు ఫలక్నుమా, ఫలక్నుమా టు బోరబండ, ఫలక్నుమా టు మెయినాబాద్, సికింద్రాబాద్ టు మెయినాబాద్, హైదరాబాద్ డెక్కన్ టు తాండూరు, విజయవాడ టు విశాఖపట్నం, బిట్రగుంట టు చెన్నై సెంట్రల్, తిరుపతి టు నెల్లూరు తదితర రైళ్లను రద్దు కానున్నాయి.