19 జూలై నుంచి అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: లాక్డౌన్ ఎత్తివేత తరువాత దశలవారిగా రైళ్ల సర్వీసులను ప్రారంభిస్తున దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా జోన్ పరిధిలో అన్ రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనుంది. ప్రధానంగా ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడవనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం ముఖ్యమైన మార్గాల్లో ట్రాకు పటిష్టత కోసం దక్షిణమధ్య రైల్వే అనేక పనులు చేపట్టింది. దీంతో జోన్ నెట్వర్క్ వివిధ సెక్షన్లలో రైళ్లు వీలైనంత పరిమిత వేగం పెంపుతో ప్రయాణించే అవకాశం ఏర్పడింది. ఈ ట్రాక్ మెరుగుదల పనులతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ఈ రైళ్లు అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులుగా నడపడానికి వీలుకలిగిందని అధికారులు తెలిపారు.
ఆన్లైన్, ఏటివిఎమ్ల ద్వారా టికెట్ల కొనుగోలు
ఈ అన్ రిజర్వ్డ్ రైలు సర్వీసులను దశలవారీగా వచ్చే వారంలో 19వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా 82 రైళ్ల సర్వీసులను దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ 82 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నడపడం వలన ప్రయాణికుల అవసరాలు తీరుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వారి టికెట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతో పాటు యూటిఎస్ యాప్ (ఆన్లైన్), ఏటివిఎమ్ (అటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు), సీఓటీవీఎం(కాయిన్ టికెట్ వెండింగ్ మెషిన్స్) మొదలగు వాటిలో కూడా టికెట్లు తీసుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.