హైదరాబాద్: తెలంగాణలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. నాలుగేళ్ల క్రితమే మీ సమస్యలన్నీ సిఎం కెసిఆర్ పరిష్కరించారని, కార్యదక్షత, సమర్థత, విజన్ ఉన్న నాయకుడు మనకు లభించడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టమని, కెసిఆర్ నిర్విరామంగా పని చేసే వ్యక్తి అని కొనియాడారు. కెసిఆర్ కృషివల్లే హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆస్థిరత ఉన్నా తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని కెటిఆర్ మెచ్చుకున్నారు. 2014లో జెఎల్ఎల్ రేటింగ్స్లో హైదరాబాద్ టాప్-20లో లేదని, 2020లో 130లో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ఎలు ఆరికెపుడి గాంధీ, జీవన్ రెడ్డి,క్రెడాయ్ ప్రెసిడెంట్ రామకృష్ణరావు, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.