అడ్మిషన్ బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సు ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అరణ్యభవన్లో అడ్మిషన్ బ్రోచర్, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. అటవీ యాజమాన్యంలో విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్షంతో సిఎం కెసిఆర్ ఎఫ్సిఆర్ఐను ప్రారంభించారన్నారు. కళాశాల ప్రారంభించిన అనతి కాలంలోనే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సాధించడం గొప్ప విషయమన్నారు. ఫారెస్ట్రీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎఫ్సిఆర్ఐ కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఎఫ్సిఆర్ఐ డీన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించి విద్యా బోధన కొనసాగిస్తున్నామన్నారు. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సు మొదటి బ్యాచ్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని, అర్హత గల విద్యార్థులు www.tsfcri.in వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్లో క్లాస్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండేళ్ళ ఈ కోర్సులో 5 విభాగాల్లో 24 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్.శోభ, సిఎం ఒఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.