Friday, April 26, 2024

ఆర్థిక ఫెడరలిజం

- Advertisement -
- Advertisement -

Economic Freedom

 

5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం

రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి

కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి
భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలి
తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది
మూలధనం లభ్యత సమస్యగా ఉంది
ముంబయి నాస్కామ్ టెకాలజీ లీడర్‌షిప్ సదస్సులో కెటిఆర్

హైదరాబాద్ : ఆర్ధిక ఫెడరలిజం వైపు కేంద్రం దృష్టి సారిస్తేనే దేశం ఆర్ధిక మందగమనం నుంచి బయటపడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇందులో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ నివ్వాలని సూచించారు. రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందితేనే దేశం ఎదుగుతుందన్న విషయాన్ని ఇప్పటికేనా కేంద్రం గ్రహించాలన్నారు. టీమ్ ఇండియా, ఫెడరల్ వంటి పదాలను కూడా కేంద్రం ఆచరణలో చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్ర ఆర్ధిక నిబంధనల సరళీకరణతో పాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ముంబైలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరమ్…. 2020 కార్యక్రమానికి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్చ్ టూ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమి రియాలిటి, అంబిషియస్ అనే అంశంపైన టెక్ మహీంద్రా ఎండి సిపి గుర్నాని నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ దిశగా పయనించాలంటే కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన విధానాలపైన సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ నూతన రాష్ట్రమైనప్పటికీ శరవేగంగా వేగంగా అభివృద్ది చెందుతున్నదన్నారు. కేవలం సేవారంగంలోనే కాకుండా ఉత్పత్తి, వ్యవసాయ రంగంలోనూ దేశ వృద్ధి రేటును మించి దూసుకుపోతున్నదన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అనుభవాలను పంచుకోవాలని సిపి గుర్నాని కెటిఆర్ కోరారు. దీంతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమి సాధించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశాభివృద్ది పట్ల ఆశావాహ దృక్పథంతో ఉన్నానన్నారు.

అయితే ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోవాలంటే ధైర్యంతో కూడిన వినూత్న నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలను దేశం ఆశించిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రం నిర్ణయాలు తీసుకోలేక పోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత రెండు మూడు సంవత్సరాలుగా దేశ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర మందగమనంలో ఉన్నదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీనిని కేంద్రం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆర్ధిక గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. కేంద్రం తన శషబిషలు వదిలి రాష్ట్రాలకు మరింత ఆర్ధిక స్వేచ్చ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ లాంటి వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలకు మూలధన లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నదని కెటిఆర్ పేర్కొన్నారు. దేశం వేగంగా అభివృద్ది చెందాలంటే మౌళిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం అమెరికా, జపాన్, యూరప్‌లోని పలు దేశాల మాదిరి చవకైన మూలధనాన్ని సేకరించి ఖర్చు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ లాంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణం నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే విదేశీ కంపెనీలు, ఆర్ధిక సంస్ధలకు కఠినమైన కేంద్ర నిబంధనలు అడ్డంకులుగా మారాయన్నారు.

అభివృద్ది కార్యక్రమాల కోసం భారీగా నిధులను ఖర్చు చేయనప్పుడు 5 ట్రియలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ సాధ్యం అవ్వడం పెద్ద సవాలే అని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్‌ఆర్‌బియం వంటి పరిమితులను కేంద్రం సవరించాలని సూచించారు. దేశంలో మౌళిక వసతుల కల్పన కోసం నిధులను సేకరించి ఖర్చు చేస్తే అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన అత్యంత సంప్రదాయిక ఆర్ధిక అలోచన అని, అభివృద్ది చెందిన అన్ని ఆర్ధిక వ్యవస్ధలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినందునే అభివృద్ది సాధ్యం అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

సేవారంగం, టూరిజం, హెల్త్ కేర్, విద్యారంగం మొదలైన రంగాల్లో కేంద్రం పూర్తి స్వేచ్చ రాష్ట్రాలకివ్వాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకి బదిలీ చేయాలన్నారు. సులభమైన నిబంధనలున్నప్పుడే ఇతర దేశాలతో తయారీ రంగంలో భారతదేశం పోటీ పడగలుగుతుందన్నారు. మనకన్నా చిన్న దేశాలైన బంగ్లాదేశ్, వియాత్నాం లాంటి దేశాలు ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్, అప్పారెల్ రంగాల్లో ముందు వరుసలో ఉన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. కేంద్రం ప్రారంభించిన మేకిన్ ఇండియా స్లోగన్ కాస్తా….. అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారిందన్నారు. తయరీ రంగంలో పూర్తి స్ధాయి తయారీ దిశగా తీసుకుపోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశ అర్ధిక వ్యవస్ధ భారీ వృద్ది చెందాలంటే భారీ ప్రాజెక్టుల అలోచన చేయాలన్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోనే పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదారాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుతో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్దం అవుతున్నామన్నారు. వీటికున్న జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సహకారం కోరినా ఇప్పటి వరకు కేంద్రం మద్దతు తెలపలేపదన్నారు.జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పట్టించుకోలేనప్పుడు భారీ ఆర్ధిక వ్యవస్ధ ఏర్పాటు లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో దేశాభివృద్దికి త్రి ఐ(3 ఐ) మంత్రం పాటించాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా నయాభారత్ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నూతన అవిష్కరణలు చేయాలని ఈ రంగంలో తెలంగాణ టి హబ్ వంటి భారీ ఇంక్యూబేటర్ ను నెలకల్పిందన్నారు.

దేశం వేగంగా ఎదుగుతున్నా ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ రంగం మాత్రం అనుకున్న మేర విస్తరించడం లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో కేవలం సుమారు రూ. 50వేల కోట్లు ఖర్చు చేస్తే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదు సంత్సరాల్లోనే సుమారు. లక్షా 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టి ఆర్ధిక ప్రగతి పాటు పడుతున్నామన్నారు. దీంతో పాటు పట్టణాలు, గ్రామాల మధ్య గ్యాప్ రాకుండా సమాంతరంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉన్నదన్నారు. వర్క్ ఫోర్స్‌లో మహిళా భాగసామ్యం పెరగాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వి..హబ్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే ప్రముఖ నగరాలన్ని మౌళిక వసతులు సంక్షోభం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి కంపెనీలను విస్తరించాలని ఆయన కోరారు.

ఇందుకోసం నాస్కామ్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీంతో కంపెనీల నిర్వహణ వ్యయం తగ్గడంతోపాటు, ఆయా నగరాల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్, మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తున్నదన్నారు. వరంగల్ నగరానికి ఐటి కంపెనీల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. మరిన్ని కంపెనీలు అక్కడికి రావాలని మంత్రి కోరారు. వ్యవసాయరంగలో ఆదాయం పెంచాల్సిన రెట్టింపు చేయాలన్న ఆర్ధిక లక్ష్యం దిశగా తెలంగాణ రాష్ట్రం వేగంగా ముందుకు పొతున్నదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతు బందు, రైతు భీమా వంటి కార్యక్రమలను చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.

States need more Economic Freedom
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News