Saturday, May 4, 2024

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన,ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనాదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం జిల్లా ఎస్‌పి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ, మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపినా, నంబర్ ప్లేట్ తొలగించినా ఇకపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, మృతుడిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పని సరిగా ధరించాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై నిఘా తీవ్రతరం చేశామని, వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇష్టారీతన వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలానా నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్‌తో పాటు తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని, అయా నెంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నట్లు గుర్తించామన్నారు.

కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ ప్లేట్ గుర్తించకుండా, నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారన్నారు. వాహనా తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ మధ్య కాలంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్‌లు, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్టా తనిఖీలను నిరంతరం నిర్వహిస్తామన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారితో ఈ రోజు నుంచి మద్యం సేవించి వాహనాలు నడపమని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కౌన్సిలింగ్‌కు వచ్చిన వారిని విడతల వారీగా కోర్టుకు పంపిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి రెండో సారి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఓవర్‌స్పీడ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగిన ప్రమాదాల గురించి ఆడియో, వీడియో ద్వారా అవగాహన కల్పిచారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పిలు రవీంద్రకుమార్, రవీందర్‌రెడ్డి, ఆర్‌ఐ నవీన్, డిఆర్‌ఎస్‌బి ఆర్‌ఎస్‌ఐ కృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News