Sunday, April 28, 2024

నేరాల నియంత్రణ, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల టౌన్: నేరాలను నియంత్రించేందుకు, నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్‌పి భాస్కర్ పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, అధికారుల పనితీరును ఎస్‌పి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ, గడిచిన ఆరు నెలల్లో పోలీస్‌స్టేషన్ల పనితీరు, కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్చయంతో పని చేయాలని సూచించారు.

పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్‌పి, సిఐలు తమ పరిధిలో ఉండే పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన వివిధ రకాల కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్‌ఐలకు సూచనలు ఇవ్వాలన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేసి ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు.

మహిళల భద్రత, చిన్న పిల్లల రక్షణ పట్ట ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై నిఘా పెంచాలన్నారు. గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా తయారీ, అమ్మకాలు, పిడిఎస్ రైస్ తదితర అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

గత ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ కింద కేసులు నమోదైన వ్యక్తులను, భూ తగదాల విషయంలో, పాత కక్షలు మనసులో పెట్టుకుని నేరాలు చేసిన వారిని, నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌ల వారీగా గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్‌పిలు వెంకటస్వామి, రవీందర్‌రెడ్డి, రాజశేఖర్‌రాజు, సిఐలు, ఎస్‌ఐలు, ఐటికోర్, డిసిఆర్‌బి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News