Thursday, May 16, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో నేల రాలిన మరో విద్యా కుసుమం

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసి మొదటి సంవత్సరం చుదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత (17) అనే విద్యార్థిని గత అర్దరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో లిఖిత అక్కకక్కడే మృతి చెందింది. మృతురాలు పీయూసి మొదటి సంవత్సరం చదువుతుంది. లికిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ సిబ్బంది లికిత మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరోవైపు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా సహా ఎవరిని లోపలికి అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే మొన్న దీపిక ఇప్పుడు లిఖిత ఆత్మహత్యలతో అసలు క్యాంపస్‌లో ఏం జరుగుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చదువుల తల్లి క్షేత్రంగా పిలుచుకునే బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యా కుసుమం నేలరాలింది. రెండు రోజులు క్రితం పీయూసి చదువుతున్న వడ్ల దీపిక అనే విద్యార్థిని బాత్‌రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.తాజాగా పీయూసి మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత భవనంపై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నది.

రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినిలు ప్రాణాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో మంత్రులు కెటిఆర్ సబితా ఇంద్రా రెడ్డి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హమి ఇచ్చారు. అయినప్పటికి ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వాగా విద్యార్థినులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారా ? మరేదైనా ఇతర కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

భారీ బందోబస్తు నడుమ బాసర ట్రిపుల్‌ఐటీ ప్రాంగణం
గత రెండు నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్ జిల్లా కేంద్రంలో అందరిని కుదిపేస్తుంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడించడానికి ప్రయత్నించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఇతర నాయకులను విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరరణం నెలకొంది. బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు ఇతర భాజాపా నాయకులను అరెస్టు చేసి బాసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యలపై పలు అనుమానాలు వ్యవక్తమవుతున్నాయి.

ఇంచార్జీ విసిని అడ్డుకున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులు
బాసర ట్రిపుల్ ఐటీలో నాల్గవ అంతస్తు నుండి పడి మృతి చెంది లిఖిత అనే విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చూసేందుకు వచ్చిన ఇంచార్జి విసి వెంకటరమణను గురువారం బిజెపి, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. విసి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం విసి మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మృతి చెందడం బాధాకరమణి అన్నారు. విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉందని ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఘటనలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News