Friday, May 10, 2024

పాక్ అనుకూల నినాదాల వివాదం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశాలతో నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ లోన్ దిగొచ్చారు. భారత సార్వభౌమాధికారాన్ని అంగీకరించడంతో పాటు రాజ్యాంగం పట్ల విధేయతను ప్రకటిస్తూ ప్రమాణ పత్రం (అఫిడవిట్) దాఖలు చేశారు. 2018లో ఎమ్‌ఎల్‌ఎగా ఉన్నప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆయన పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారనే విషయం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి రావడంతో ఈమేరకు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370 రద్దును సవాల్ చేసిన వారిలో అక్బర్‌లోన్ ప్రధాన పిటిషనరు.

ఆయన తరఫున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ మంగళవారం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనానికి ఈమేరకు అఫిడవిట్ సమర్పించారు. తాము ఈ ప్రమాణపత్రాన్ని పరిశీలిస్తామని రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. అయితే కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా ఈ అఫిడవిట్‌పై పెదవి విరిచారు. గతంలో జరిగిన దానికి సంబంధించి లోన్ ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. కోర్టు దీనిపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ పూర్తయింది. 16 రోజుల పాటు వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News