Sunday, April 28, 2024

ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ – ఈ నెల 19కి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇడి జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అనంతరం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మహిళల విచారణలో సిఆర్‌పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో వెల్లడించారు. కవిత పిటిషన్‌పై గత కొద్ది నెలలుగా సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఇటీవలే ఫిబ్రవరి 28న ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో విచారణకు రావాలని ఇడి జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం విదితమే. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు ఇటీవలే ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు రావాలని వెల్లడించింది. దీనిపై ఎంఎల్‌సి కవిత స్పందించి విచారణకు హాజరు కాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున హాజరు కాలేనని ఆమె ఆ లేఖలో వివరించింది. గతంలో కవితకు రెండు సార్లు ఇడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారు లు మూడు రోజులు విచారించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News