వ్యక్తుల స్వేచ్ఛకు గళమెత్తిన జస్టిస్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ ఆదివారం కన్నుమూశారు. 62 సంవత్సరాల గౌడర్ ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో స్థానిక మేదాంత ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర విభాగానికి తరలించారు. చికిత్స దశలో చనిపోయినట్లు వెల్లడైంది. కొవిడ్ 19 సంబంధిత క్లిష్టతలు తలెత్తినట్లు అధికారికంగా ఎటువంటి నిర్థారణ కాలేదు. శ్వాసకోశ సంబంధిత సమస్యతోనే చనిపోయినట్లు నిర్థారించారు. సుప్రీంకోర్టులో ఆయన సీనియార్టీ విషయంలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. కర్నాటకలోని ధర్వాడ్కు చెందిన శాంతనగౌడర్ 1958లో జన్మించారు, కొద్ది కాలమే ధర్వాడ్లో 1980 ప్రాంతంలో లాయర్గా ప్రాక్టిస్ చేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ విషయాలలో న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. అడ్వకేట్ ఛాంబర్లో చేరి తరువాతి దశలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన కర్నాటక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా , ఆ తరువాత రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా వ్యవహరించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరిలో పదోన్నతి పొందారు. 2023 మే 4వ తేదీ వరకూ ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా కొనసాగవల్సి ఉంది. అన్ని విషయాలపై ఆచితూచి మాట్లాడే వ్యక్తిగా పేరొందిన శాంతనగౌడర్ తీర్పుల విషయంలోనూ విలక్షణతను పాటించారు. వ్యక్తుల స్వేచ్ఛకు ప్రాధాన్యతను కల్పిస్తూ కీలక తీర్పులు వెలువరించిన న్యాయమూర్తిగా ప్రత్యేకత పొందారు. నిందితుడి నేరం నిర్థారణ అయ్యే వరకూ న్యాయం పొందే హక్కు పూర్తిగా ఉంటుందని, బెయిల్ పొందే సంపూర్ణ స్వేచ్ఛ కలిగి ఉంటాడని తమ తీర్పులతో తెలిపారు. నిందితుడిపై దర్యాప్తు జాప్యం ఏర్పడితే వెంటనే బెయిల్కు అవకాశం ఇవ్వాలని తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తి నేరస్తుడిగా శిక్షకు గురై, చెరసాలలో ఈ క్రమంలో మానసిక వైకల్యానికి గురైతే శిక్ష కాలం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.