Wednesday, May 1, 2024

పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ

- Advertisement -
- Advertisement -

Supreme court orders independent probe into Pegasus

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో కూడిన దర్యాప్తు కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్ పర్యవేక్షణలో పని చేసే ఈ కమిటీలో సైబర్‌సెక్యూరిటీ రంగంలో నిపుణులు నవీన్ కుమార్‌చౌదరి, ప్రభాహరన్ పి, అశ్విన్ అనిల్ గుమస్తేలు ఉంటారని తెలిపారు.. నిపుణుల కమిటీ పని తీరును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పలు పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా బుధవారం దీనిపై తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది.

దేశ పౌరులపై వివక్షాపూరిత నిఘాను తాము ఎన్నటికీ అనుమతించబోమని స్పష్టం చేసింది. ‘మనం సాంకేతిక శకంలో జీవిస్తున్నాం. అయితే టెక్నాలజీ ఎంత ముఖ్యమో వ్యక్తుల గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమనే విషయాన్ని మనమంతా గ్రహించాలి.పెగాసస్ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం, ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాం. దీనిపై తీసుకున్న చర్యలేమిటో వారి స్పందన ఏమిటో సవివరంగా తెలిపేందుకు కేంద్రానికి అనేక అవకాశాలు ఇచ్చాం. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండా అసంపూర్తి అఫిడవిట్‌ను సమర్పించింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అనే దానిపై కేంద్రంనుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. దేశ భద్రత పేరు చెప్పి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇక్కడ పిటిషనర్లు చేసిన ఆరోపణలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి. కేంద్రం కూడా దీనిపై కమిటీ వేయడానికి సుముఖంగా ఉంది. అందువల్ల కమిటీని ఏర్పాటు చేయడం తప్పితే మరో అవకాశం కనిపించలేదు’ అని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలు కూడా ఉన్న ధర్మాసనం పేర్కొంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో టార్గెట్ చేసుకున్న వారిలో 200 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కేంద్రమంత్రులు, పలువురు పాత్రికేయులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు దీనిపై కేంద్రం స్పందనను కోరింది. అయితే దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయడం లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.

అంతా అపార అనుభవం ఉన్న వారే…

కాగా సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీలోని ముగ్గురు సభ్యులు కూడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ రంగాల్లో అపారమైన అనుభవం ఉన్నవారే కావడం గమనార్హం. కమిటీలోని మొదటి సభ్యుడైన నవీన్ కుమార్ చౌదరి గుజరాత్ గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో ప్రొఫెసర్, డీన్‌గా ఉన్నారు.ఈయనకు ఈ రంగాల్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఇక రెండో సభ్యుడు ప్రభాహరన్ పి కేరళలోని అమృతపురిలో ఉన్న అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెపర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీ రంగాల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.

ఇక మూడో సభ్యుడు అశ్విన్ అనిల్ గుమస్తే ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన తన రంగంలో 20 పేటెంట్లు పొందడంతో పాటుగా 150కి పైగా పరిశోధనా పత్రాలు, మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్ సారాభాయ్ రిసెర్చ్ అవార్డు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు సహా పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ సైంటిస్టు కూడా ఉన్నారని సుప్రీంకోర్టు కమిటీకి సంబంధించిన వివరాల్లో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News