న్యూఢిల్లీ: కాళీ పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బాణసంచా వాడకాన్ని నిషేధిస్తూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రానున్న కాళీ పూజ, ఛత్ పూజ తదితర పండుగల నేపథ్యంలో కాలుష్యాన్ని నివారించడానికి బాణసంచా వాడకాన్ని, అమ్మకాలను నిషేధిస్తూ కలకత్తా హైకోర్టు గతవారం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గౌతమ్ రాయ్ అనే వ్యక్తి,బర్రబజార్ ఫైర్వర్క్ డీలర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది.
పండుగలు ముఖ్యమైనప్పటికీ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలే ముప్పులో ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తమ కన్నా హైకోర్టుకే స్థానిక పరిస్థితులు బాగా తెలుసునని, ప్రజలకు అవసరమైన చర్యలను హైకోర్టే తీసుకోనివ్వాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిలో మనమంతా ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నామని, మనందరి ఇళ్లలో వృద్ధులు ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. వయసు పైబడిన వ్యక్తులు వివిధ అనారోగ్యసమస్యలతో బాధపడుతుంటారని,ముఖ్యంగా వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునిహైకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ధర్మాసనం తెలిపింది.