కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందేలా వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వచించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తెలిపారు. కొవిడ్-19ను నిరోధించడంలో తాము రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతానికి పైగా సమర్ధంగా పనిచేస్తుందని ఫైజర్ ఇన్కార్పొరేషన్, బయోఎన్టెక్ ఎస్ఇ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమర్ధవంతంగా పనిచేయగల వ్యాక్సిన్ను ఫైజర్ తయారుచేసినప్పటికీ అది ప్రతి భారతీయుడికి అందే విధంగా కార్యాచరణ జరగాలని రాహుల్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని భారత ప్రభుత్వం నిర్వచించి అది ప్రతి భారతీయ పౌరుడికి ఎలా అందుతుందో తెలియచేయాలని ఆయన అన్నారు. మైనస్ 90 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సిన ఫైజర్ వ్యాక్సిన్ను భారతదేశానికి చేరవేయగల సామర్ధం ఉన్న రవాణా వ్యవస్థ ఏదీ భారత్లో లేదని పేర్కొంటూ వెలువడిన ఒక మీడియా కథనాన్ని రాహుల్ ఈ సందర్భంగా తన ట్వీట్కు జతచేశారు.