ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్ఒ కోటాచలం కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. బుధవారం కొవిడ్ పరీక్షలు చేసుకున్న డిఎంహెచ్ఒ కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. డిఎంహెచ్ఒ భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్గా తేలింది. గురువారం కొవిడ్ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్వో కోటాచలంకు కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది. డిఎంహెచ్ఒ కుమారుడు, కోడలు 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చారు. దాంతోపాటు ఆయన కుటుంబం రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లివచ్చినట్లు తెలిసింది. మరోవైపు డిఎంహెచ్ఒ కోటాచలం బుధవారం ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకు కూడా గురువారం కరోనా పాజిటివ్గా తేలటం వల్ల ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.