హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న హన్మకొండలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్లు ఆదివారం పనులు పరిశీలించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా జెఎన్ఎస్ స్టేడియం మారనుందని, క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడల నిర్వహణకు హన్మకొండ జెఎన్ఎస్ స్టేడియం అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చయన్నారు. ఒలంపిక్స్, ప్రపంచస్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు రాణించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా పథకంలో భాగంగా రూ.8 కోట్లతో ట్రాక్ను నిర్మిస్తున్నదన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్ కృషితో అప్పటి ఎంపి నిధుల నుండి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేశారని, హన్మకొండలో అతిత్వరలో సింథటిక్ ట్రాక్ను ప్రారంభించనున్నామన్నారు. అంతర్జాతీయ క్రీడలకు వరంగల్ నగరం ఒక కేంద్రంగా మారనుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్నారని, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి జెఎన్ఎస్ స్టేడియంకు క్రీడాకారులు వస్తుంటారని తెలిపారు. అతిత్వరలోనే జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని పున:ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.