Tuesday, April 30, 2024

కొడుకు కాలేజీ ఫీజు కోసం.. తల్లి ప్రాణత్యాగం (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

చెన్నై : కన్న కొడుకు చదువు కోసం కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులేక ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం కన్నతల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలంలో జరిగింది. సేలంలోని రెండవ అగ్రహారం వీధిలో పాపాతి అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 46 ఏళ్ల పాపాతి కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తోంది.

18 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా గడుపుతోంది. ఆమెకు నెలకు 10 వేలు వేతనం. ప్రస్తుతం తన కుమార్తె ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతుండగా, కొడుక ప్రైవేట్ కాలేజీలో డిప్లొమా చదువుతున్నాడు. తన కుమారుడిని ఎలాగైనా చదివించాలని పట్టుదల ఉన్నా తనకు వచ్చే వేతనం ఇంటి ఖర్చులకే సరిపోక పోవడంతో ఏం చేయాలో ఆమెకు దిక్కు తోచడం లేదు. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక పోతోంది. కొడుకు కళాశాల ఫీజు కట్టడానికి రూ. 45 వేలు అవసరమయ్యాయి. రూ. 10 వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోన్న ఆమెకు ఒకేసారి రూ. 45 వేలు తీసుకురావడం తలకు మించిన పనైంది.

డబ్బుకోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఎవరూ అప్పు కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఉన్న అప్పులు పెరిగిపోవడం, తన కుమార్తె వివాహం చేసే భారం కూడా ఉండడంతో తనలోతానే కుమిలిపోయింది. ఈ పరిస్థితుల్లో బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఎవరో ఆమెకు చెప్పారు. దాంతో తాను మరణిస్తే తన కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని భావించి ఈనెల 18న బస్సు కింద పడి ప్రాణత్యాగం చేసుకుంది.

బస్సు డ్రైవర్ కూడా బస్సునే అక్కడే ఆపేశాడు. పోలీస్‌లు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిజానికి అంతకు ముందే పాపాతి రెండు మూడు సార్లు వేరే వాహనాల కింద పడడానికి ప్రయత్నించింది. కానీ స్వల్ప గాయాలతో బయటపడింది. పాపాతి బస్సు కింద పడిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News