Friday, April 26, 2024

కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్‌వన్

- Advertisement -
- Advertisement -

errabelli-dayakar-rao

ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అద్భుతం,  రాష్ట్ర పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లిని అడిగి తెలుసుకున్న కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా,  సిఎం కెసిఆర్‌కు అభినందనలు, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. ఒక్క హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలు, పల్లెలు పచ్చగా ఉన్నాయి. మంచినీటికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు నల్లాల ద్వారా ఇంటింటికీ నిరంతరం అందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా సోమవారం మధ్యాహ్నం మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న తాజా పరిస్థితులు, మంచినీటి వసతులపై ఆయన ఆరా తీశారు.

గ్రామాల్లో, జిల్లాల్లో కరోనా కేసులు నిల్

మీ రాష్ట్రంలో కరోనా వైరస్ తాజా పరిస్థితి ఏమిటి? కరోనా ప్రభావం ఎలా ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచినీటి వసతులు బాగున్నాయా? అంటూ కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా మంత్రి దయాకర్ రావు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. దేశంలోనే మొదటిసారిగా సిఎం కెసిఆర్ లాక్‌డౌన్ విధించారని, పగలంతా పకడ్భందీగా లాక్‌డౌన్ విధిస్తూనే, రాత్రిళ్లు కర్ఫ్యూని విధిస్తున్నామని కేంద్రమంత్రితో ఎర్రబెల్లి పేర్కొన్నారు.

అయితే హైదరాబాద్ ఒక్క నగరంలోనే ప్రస్తుతం 40కి కొద్దిగా అటు, ఇటుగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. గ్రామాల్లో, జిల్లాల్లో దాదాపు కేసులు లేవన్నారు. దీంతో హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల మాత్రమే రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశామని, జిల్లాలు, గ్రామాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లుగానే ఉన్నాయన్నారు. రెడ్ జోన్లలో కంటైన్మెంట్ ని కూడా నిర్వహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రి కటారియాకు వివరించారు.

ఎండాకాలం సీజన్‌లోనూ మంచినీటికి కొరత రాకుండా చర్యలు

అలాగే రాష్ట్రంలో పేదలకు 12కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం, వలస కూలీలను ఆదుకుంటున్నామన్నారు. వారికి కూడా బియ్యం, నగదు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిత్యావసర సరుకుల కొరత లేకుండా, వాటి ధరలు అదుపులో ఉండేలా కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ ఎండాకాలం సీజన్ లోనూ మంచినీటికి కొరత రాకుండా చూస్తున్నామన్నారు.

మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కరోనా కట్టడి చేయడంలో ఆర్థివ వ్యవస్థని సైతం పక్కన పెట్టి, ప్రజల ప్రాణాలే ముఖ్యమని సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితాలిస్తున్నాయన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ సిఎం కెసిఆర్ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తున్నారని ఎర్రబెల్లి కేంద్ర మంత్రితో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా మాట్లాడుతూ ఈ విషయాలు తాము కూడా విన్నామని, ఎప్పటికప్పుడు దేశ పరిస్థితిని తెలుసుకుంటున్నామని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో పాటు, కరోనా కట్టడిలోనూ ముందు ఉండటం గొప్ప విషయమని, కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని, సిఎం కెసిఆర్‌ని అభినందించారు.

Telangana Number One in coronavirus Prevention

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News