మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయరెడ్డి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లు బుధవారం వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుతెలిపారు. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి జరుగనున్న టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటలకు ముగుస్తాయని అన్నారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు యూనిఫాం ధరించి రావొద్దని తెలిపారు. యూనిఫాంతో వచ్చే విద్యార్థులకు పరీక్షకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమయ్యే ముందే, విద్యార్థులు చేయాల్సిన ప్రక్రియ కొంత ఉంటుందని…వీలైనంత ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎక్కువగా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వస్తారని, ఏవైనా కారణాల వల్ల కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని తెలిపారు. ఈ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వీణా వాణీలకు వేర్వేరు హాల్టికెట్లు
అవిభక్త కవలలు వీణా వాణిలు ఈ సారి పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని సంచాలకులు ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. వీణా వాణీలకు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేస్తామని…వారు ఒకే చోట పరీక్ష రాస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 5.34 లక్షల మంది విద్యార్థుల కోసం 2,530 కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.