న్యూఢిల్లీ : సమకాలిన ప్రపంచ క్రికెట్లో రవీంద్ర జడేజాను మించిన ఫీల్డర్ మరోకడూ లేడని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్గా జడేజాను పేర్కొన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ జడేజా చేసే విన్యాసాలను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. భారత క్రికెట్కు లభించిన అత్యుత్తమ ఫీల్డర్లలో జడేజాది ప్రత్యేక స్థానమన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా అత్యున్నత స్థానంలో ఉన్నాయన్నాడు.
జట్టులోని దాదాపు ప్రతి ఒక్కరూ మెరుగైన ఫీల్డర్లుగా పేరు తెచ్చుకున్నారన్నాడు. కానీ, వీరిలో జడేజాకు ఉన్న ప్రత్యేకత వేరు అని ప్రశంసించాడు. పాదరసంలా కదులుతూ అతను బంతిని ఆపే తీరు చూడముచ్చటగా ఉంటుందన్నాడు. అంతేగా రెప్పపాటు సమయంలో అతను చేసే రనౌట్లు చూస్తే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేమన్నాడు. దీంతోపాటు కళ్లు చెదిరే క్యాచ్లను పట్టడంలో కూడా జడేజా ప్రత్యేక పరిణితి సాధించాడన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అతనికి ఎదురులేదన్నాడు. ఇక జడేజా లాంటి అగ్రశ్రేణి ఆల్రౌండర్ లభించడం టీమిండియా అదృష్టమని గంభీర్ పేర్కొన్నాడు. ఓ స్పోర్ట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో గంబీర్ ఈ విషయాలు వెల్లడించాడు.