Wednesday, May 1, 2024

ఒకే రోజు మూడు సైబర్ నేరాలు

- Advertisement -
- Advertisement -

Three cyber crimes in one day at Hyderabad

రూ.11.10 కోట్లుదోచుకున్న సైబర్ నేరస్థులు
కేసు దరాప్తు చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: సైబర్ నేరస్థులు ఒకేరోజు రెచ్చిపోయారు. నగరంలోని ముగ్గురు బాధితుల వద్ద నుంచి వివిధ కారణాలు చెప్పి భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరానికి చెందిన గీతనారాయణ్ పేరుతో డాక్టర్ మురళీమోహన్ రావుకు ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో ఖరీదైన ఆయిల్ వ్యాపారం చేస్తున్నానని డాక్టర్‌ను నమ్మించాడు. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రోసీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని చెప్పాడు. ఈ వ్యాపారం చేస్తే లాభాలు భారీగా వస్తాయని చెప్పడంతో నమ్మి దశల వారీగా అమెరికా డాలర్ల రూపంలో రూ.11కోట్లు పంపించాడు. డబ్బులు ముట్టేవరకు నిందితుడు ప్రతి రోజు ఛాటింగ్ చేసేవాడు. డబ్బులు తీసుకున్న తర్వాత మెసేజ్ చేసినా స్పందించడం మానివేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లాటరీ వచ్చిందని….

నగరంలోని పాతబస్తీకి చెందిన ముంతాజ్‌బేగంకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. ఇటీవల మీరు చేసిన షాపింగ్‌లో రిజిస్ట్రర్ అయిన మీ మొబైల్ నంబర్‌కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని చెప్పాడు. ముందుగా గిఫ్ట్ ట్యాక్స్ కింద 30శాతం డబ్బులు ముందుగానే చెల్లించాలని చెప్పడంతో నమ్మింది. సైబర్ కేటుగాళ్లు చెప్పినట్లుగా వారి చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ.5,25,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత వారికి ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కెవైసీ అప్‌డేట్ పేరుతో…..

కెవైసి అప్‌డేట్ చేయాలని చెప్పి సైబర్ కేటుగాళ్లు బాధితుడిని నమ్మించి రూ.5లక్షలు కొట్టేశారు. నగరంలోని డిడి కాలనీకి చెందిన సత్యనారయణకు రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని చెప్పాడు. తాను మొబైల్‌కు లింక్ పంపిస్తున్నానని దాని ద్వారా కెవైసి అప్‌డేట్ చేయాలని నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థుడు పంపించిన లింక్ ఓపెన్ చేసి డెబిట్ కార్డు నంబర్, తన వివారాలు నమోదు చేశాడు. తర్వాత తన మొబైల్‌కు వచ్చిన ఓటిపి నంబర్‌ను కూడా సైబర్ నేరస్థులకు చెప్పాడు. వెంటనే సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.5,30,000 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. డబ్బులు తన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా కాగానే మోస పోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News