Sunday, April 28, 2024

పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద 1791 సైబర్ నేర కేసులు నమోదైతే, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి.ఒక్క ఏడాదిలోనే 60% పెరుగుదల నమోదైంది. 2008లో దేశవ్యాప్తంగా 288 సైబర్ నేరాలు నమోదైతే, 2009లో 420, 2010లో 966, 2011లో 1791, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి. అంటే సైబర్ నేరాల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ సెక్షన్) ప్రకారం 2011లో 422 సైబర్ నేరాలు నమోదైతే, 2012లో 601 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క ఏడాది వ్యవధిలో 42.4 శాతంత పెరుగుదల నమోదయిందం టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు వ్యవహారాలు ఆన్‌లైన్ అయ్యేకొద్దీ,ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2021- 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి.

సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్‌వరడ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్‌లో దాచుకున్నారు.11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్‌లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు.
సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం-2013ను రూపొందించి, విడుదల చేసింది. తద్వారా సైబర్ భద్రత విధానం కలిగిన కొద్ది దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. నూతన విధానం కింద 14 సరికొత్త అంశాలను లక్ష్యాలుగా ప్రకటించింది.దేశ ఇంటర్నెట్ అస్థిరతను, ఆర్థిక అస్థిరతతో సమానంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని లక్షల మంది ఇంటర్నెట్ భద్రతా (Cyber Security Experts) నిపుణులతో కూడిన సమర్థ సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. సాంకేతిక శిక్షణ, సామర్థ్య నిపుణులతో ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించింది

. అన్ని విధాలుగా సైబర్ భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. దేశంలోని వివిధ స్థాయిల్లో సైబర్ భద్రతతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం సూచిస్తోంది. సైబర్ భద్రతకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒక జాతీయ నోడల్ ఏజెన్సీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ యంత్రాంగాలు పనిచేయాల్సి ఉంటుంది.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి,తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తున్నారు.అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు,రివార్డులు, జాబ్స్, కమీషన్లు,డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశచూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని,ఆధార్ నంబర్ చెప్పండి,మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండి,మీ ఏటీఎం పనిచేయడం లేదని,మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు.

ఆన్‌లైన్ మోసాలే కాకుండా సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం గ్రామాలు,పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లలో విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, వివరాలు, తెలియజేస్తే 24గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది.
మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు.అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది.గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి.బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు.వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై ఉపయోగించకపోవడం మంచిది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్‌లోడ్ చేయకపోవడం ఉత్తమం. గోప్యత పాటించాలి. అప్పుడే సైబర్ నేరాలు తగ్గి, ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News