హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ల్యాబ్ ను హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రారంభించారు. కేంద్ర మంత్రులతో రాజ్నాథ్సింగ్, కిషన్ రెడ్డితో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహాయంతో డిఆర్ డిఒ ఈ ల్యాబ్ ను తయారు చేసింది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎనిమిది ఆస్పత్రులను కోవిద్-19 ఆస్పత్రులుగా మార్చినామని, కేంద్రం మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. స్వీయనియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసులు 943 నమోదు కాగా 24 మంది మృతి చెందారు. భారత్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 21,472కు చేరుకోగా 682 మంది మృత్యువాతపడ్డారు. ఎపిలో కరోనా వైరస్ 813 మందికి సోకగా 24 మంది చనిపోయారు.