రాష్ట్రపతికి టిఎంసి ప్రతినిధి బృందం విజ్ఞప్తి
న్యూఢిల్లీ : భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆ పదవి నుంచి తక్షణం తొలగించాలని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్రపతిని ఈ బృందం కలుసుకుని మెమోరాండం సమర్పించింది. సొలిసిటర్ జనరల్ అనుచిత ప్రవర్తన, అనౌచిత్యానికి పాల్పడిన కారణంగా ఎస్జిని తక్షణం ఆ పదవి నుంచి తప్పించాలని మెమోరాండంలో డిమాండ్ చేశారు. టిఎంసి ఎంపిలు సుఖేందు శేఖర్ రే, మహువా మొయిత్రా కూడా రాష్ట్రపతికి దీనిపై లేఖ సమర్పించారు. బిజెపి నేత , బెంగాల్ అసెంబ్లీ విపక్ష నేత సువేందు అధికారి జులై 1న ఢిల్లీ లోని కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసి , తరువాత అక్కడ నుంచి నేరుగా 10 అక్బర్ రోడ్డు లోని సొలిసిటర్ జనరల్ ఇంటికి వెళ్లారని ఆరోపించారు.
అయితే సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. సువేందు అధికారి తనను అధికారిక నివాసంలో కలుసుకోలేదని పేర్కొన్నారు ఒకప్పుడు టిఎంసిలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి 2016 నారదా టేప్ కేసులో నిందితుడని, మెహతా సుప్రీం కోర్టులో సిబిఐ తరుఫున వాదించే ప్రతినిధి అని, నారదా, శారదా చిట్ఫండ్ కేసులను ప్రభావితం చేసేందుకే సువేందు అధికారి ఎస్జిని కలిశారని టిఎంసి ఎంపిల బృందం ఆరోపించింది. బార్ కౌన్సిల్ నిబంధనలను, వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించిన తుషార్మెహతాను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.