న్యూఢిల్లీ: తన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న హింసాకాండను అదుపుచేయడంలో తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, రాజ్యసభలో కొనసాగడం తనకు ఇబ్బందికరంగా ఉన్నందున తాను రాజీనామా చేస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దినేష్ త్రివేది శుక్రవారం ప్రకటించారు. రాజ్యసభలో తన రాజీనామా నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తూ ఇక్కడ నిశ్చింతగా కూర్చుని ఏమీ చేయకుండా ఉండేకన్నా తన సొంత గడ్డకు వెళ్లి అక్కడ ప్రజలతో కలసి పనిచేయడమే మంచిదని తాను భావిస్తున్నానని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తన రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను చూస్తూ ఇక్కడ నిస్సహాయంగా కూర్చోలేకపోతున్నానని త్రివేది చెప్పారు. తనను ఇక్కడకు పంపించిన తన పార్టీకి తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని, అయితే ఇప్పుడు తాను కొంత ఇబ్బంది పడుతున్నానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తిని ఆయన ఉటంకిస్తూ ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చునే కన్నా సొంత గడ్డకు వెళ్లి ఏదో ఒకటి చెయ్యమని తన అంతరాత్మ చెబుతోందని త్రివేది అన్నారు. కాగా, రాజ్యసభకు రాజీనామా చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, చైర్మన్కు లిఖితపూర్వకంగా రాజీనామా సమర్పించాలంటూ రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ టిఎంసి ఎంపికి సూచించారు.