Saturday, April 27, 2024

ఈ నెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జెఎన్‌టియుహెచ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషన్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు పాల్గొంటారని ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ పరీక్షల ప్రాథమిక కీ చేసి, విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించగా, గురువారం తుది కీ తో పాటే ఎంసెట్ ఫలితాలు వెల్లడించనునున్నారు.

రాష్ట్రంలో అగ్రికలర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ ఈనెల 14న విడుదల 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అలాగే ఈ నెల 12,13,14 తేదీలలో జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ ని ఈ నెల 15న విడుదల చేసి 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఎంసెట్ ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడాలి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
ఈసారి భారీగా దరఖాస్తులు
ఎంసెట్‌కు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ పరీక్షకు 2,05,405 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ పరీక్షలకు 1,15,361 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. మొత్తంగా ఈ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు
గతంలో ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఉండేది. ఈ సంవత్సరం నుంచి ఇంటర్ మార్కుల వెయిటేజీ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ర్యాంక్ కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News