వెబ్సైట్లో వివరాలు నమోదు, పాఠశాలల్లోనే మెమోలు
పొరపాట్లు తలెత్తితే ఎస్ఎస్సి బోర్డుకు పంపించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ వివరాలను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్ వివరాలను www. bse.telangana.gov. in వెబ్సైట్లో పొందవచ్చని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని తెలిపారు. పాస్మెమో వివరాల్లో ఎమైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సి బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయం మేరకు అందరినీ ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రతిపదికన గ్రేడ్లను నిర్ణయించినట్లు తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో తమ శక్తి సామర్థాలు, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
TS SSC Board declared 10th Class Results 2020