Sunday, May 19, 2024

నేటి నుంచి ‘ టీ 9 -30 టికెట్ ’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టీ 9 -30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ‘ టీ 9 -60 బస్ టికెట్’ వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా ‘టీ 9 -30 టికెట్ ’ ను ప్రవేశపెట్టాలని ఆర్‌టిసి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టీ 9 -30 టికెట్’ పోస్టర్ ను టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్‌లు ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్‌లు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. నేటి (ఈ నెల 27 గురువారం ) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులందరికీ ఈ రాయితీ పథకం వర్తిస్తుందన్నారు. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు ‘ టీ 9-30 టికెట్ ’ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ టికెట్ తో 30 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రానూపోను ప్రయాణం చేయొచ్చునని తెలిపారు. కాగా 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా ఈ టికెట్ వర్తిస్తుందని, ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి కనీసం రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని వారు వెల్లడించారు.

ఈ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునన్నారు. కాగా ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్‌లు తెలిపారు. అంతే కాకుండా ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ‘ టీ 9 -60 టికెట్ ’ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీలు ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ‘ టీ 9-30 టికెట్ ’కు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు. ‘ టీ 9 30 టికెట్ ’కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. కాగా ‘టీ 9 -30టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్ , చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్ విజయ్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌లతో పాటు వర్చువల్ గా ఈడీలు, ఆర్‌ఎంలు, డిప్యూటీ ఆర్‌ఎంలు, డీఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News