Monday, May 6, 2024

రూ. 5142 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టిటిడి ధర్మకర్తల మండలి

- Advertisement -
- Advertisement -

శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
మండలి అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్:  టిటిడి వార్షిక బడ్జెట్ ( 2024–25 ఆర్థిక సంవత్సరానికి) రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఛైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తామని, వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేసి వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయించినున్నట్లు తెలిపింది.గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించినపుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదని, ఇది మహిళలకు స్వామివారి కానుక అని తెలిపింది.టిటిడి ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు మండలి ఆమోదం తెలిపింది.

దాదాపు 30 ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టిటిడి పాలకమండలి కృతజ్ఞతలు తెలియచేసింది. టిటిడిలోని వివిధ విభాగాలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచుతామని,టిటిడి పోటు విభాగంలో 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్ సెమి స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523/- నుండి రూ.15 వేలకు పెంచేందుకు మండలి ఆమోదం తెలిపింది. అన్నదాన విభాగంలో 138 మంది క్లీనర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్ కేటగిరీలోకి మార్చి వారి వేతనాలను రూ.17 వేల నుండి రూ.22 వేలకు పెంపు, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్ విభాగాల్లో పనిచేసే కార్మికులను అన్స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్పు చేసేందుకు మండలి ఆమోదం తెలిపింది.

శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారుచేస్తున్న శిల్పుల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, వారి వేతనాల పెంపుదలకలంకారి కళలో నిపుణులైన శ్రీ మునస్వామిరెడ్డి వేతనం రూ.25 వేల నుండి రూ.39 వేలకు పెంపు,టిటిడి అనుబంధ, విలీన ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకుల వేతనాలను రూ.26 వేల నుండి రూ.31 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.టిటిడి స్టోర్లో పనిచేసే 9 మంది వర్కర్లకు వారి వేతనం రూ.9 వేల నుండి రూ.15 వేలకు పెంపు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా సేవలందిస్తున్న క్రమాపాఠీలకు రూ.16 వేల నుండి రూ.22 వేలకు, ఘనాపాఠీలకు రూ.17 వేల నుండి రూ.25 వేలకు సంభావన పెంపుతో పాటు 1400 మంది వేదపారాయణదారులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.10 వేల నుండి రూ.12 వేలకు పెంచుతూ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయని,వీటిలో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుండి రూ.54 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.

టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. టిటిడి అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక్క తిరుపతి జిల్లా మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలకు పెంచుతూ మండలి నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా, 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనాలను పెరుగుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు రూ.148 కోట్లతో టెండరును ఆమోదించినట్లు పేర్కొంది. తిరుమలలోని ఆకాశగంగ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లతో టెండరుకు, తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదం లభించింది.తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి ,పెయింటింగ్ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతికి, ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరుకు ఆమోదం లభించింది.

రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్ హెల్త్గా వ్యవహరించడం జరుగుతుంది.టిటిడి పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఓరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఇఆర్పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది.తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం పొందింది.అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల, తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టు నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను టిటిడి ఛైర్మన్ భూమన కరణాకరరెడ్డికి, ఈవో ఏవి. ధర్మా రెడ్డికి అందజేసింది. ఈ సమావేశంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News