న్యూఢిల్లీ : టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాకిస్థాన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని ఇందులో జోక్యం చేసుకోవద్దని సూచించింది. భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవేష్ కుమార్ ఈ సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ పూర్తిగా భారత్లో సమగ్ర భాగమని అందువల్ల భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని స్పష్టం చేశారు. పాక్ లో పర్యటిస్తున్న ఎర్డోగన్ శుక్రవారం పాక్ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో మాట్లాడుతూ కశ్మీర్ ప్రజల పోరాటాన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో విదేశీ ఆధిపత్యంపై టర్కీ ప్రజలు సాగించిన పోరాటంతో పోల్చారు. కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, ఇటీవల ఏకపక్షంగా తీసుకున్న చర్యల కారణంగా ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయని ఎర్డోగన్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నుంచి భారత్కు ఎదురౌతున్న ఉగ్రవాద ముప్పు వంటి వాస్తవాలను టర్కీ నాయకత్వం
తెలుసుకోవాలని రవేష్ కుమార్ సూచించారు.