Monday, April 29, 2024

డిజిటల్ ఆర్మీగా ఉక్రెయిన్ సైబర్ దండు వ్యూహాలు..

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ లోని ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పాటై తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెడరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. డిజిటల్ రంగంలో అనేక మంది ఉక్రెయిన్లు ఉన్నారని, వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాంది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. తామంతా స్వీయ నియంత్రణలో పనిచేస్తున్న ఓ దండులా ముందుకు సాగుతున్నామని డిజిటల్ ఆర్మీలో కీలకంగా వ్యవహరిస్తున్న 37 ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్ రోమన్ జఖరోవ్ తెలిపారు. రష్యన్ వెబ్‌సైట్ల సేవలను అడ్డుకోవడంతోపాటు టెలిగ్రాం ఛానెళ్లలో ప్రత్యేక బోట్లను నిర్వహించడం వరకూ అనేక కార్యక్రమాలను “స్టాండ్ ఫర్ ఉక్రెయిన్‌” పేరిట జఖరోవ్ బృందం నిర్వహిస్తోంది. తప్పుడు వార్తలను అడ్డుకోవడం, రష్యన్ సేవలు ఏయే ప్రాంతాలకు చేరుకున్నారు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

దీనికోసం స్థానికంగా ఉన్న అనేక మందిని ప్రత్యేక ఛానళ్లలో చేర్చుతున్నారు. వారి ద్వారా సమాచారాన్ని రాబట్టి దాన్ని విశ్లేషించి ఇతరులకు పంచుతున్నారు. తమదైన వ్యూహాలు, విశ్లేషణల ద్వారా రష్యన్ సేవల్ని ఎలా అడ్డుకోవాలో సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉక్రెనియన్లు సైతం ఈ డిజిటల్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నుంచి ఆన్‌లైన్ యాడ్ బయ్యర్లు వరకు చురుగ్గా సహకరిస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా గ్రాఫిక్స్, యుద్ధం వల్ల సంభవిస్తున్న దారుణాలను సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. చివరకు నేరుగా రష్యన్లకు ఫోన్లు చేస్తున్నారు. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న రష్యన్ సైనికుల ఫోటోలు వీడియోలు తీసి వారి స్వదేశానికి పంపి, వారి తల్లిదండ్రులు చూసేలా చేస్తున్నారు. రష్యన్ ఆర్థిక వ్యవస్థ, క్రెమ్లిన్ నియంత్రణలో ఉన్న మీడియా, రైల్వేలను లక్షంగా చేసుకుని ఉక్రెయిన్ ఐటీ ఆర్మీ దాడి చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితంగా రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ టెలికమ్యూనికేషన్లలో అంతరాయం సృష్టించ గలిగారు. రైలు టికెట్ల జారీ వ్యవస్థను దెబ్బతీయగలిగారు. టెలిఫోన్ సేవలకు అంతరాయం కలిగించ గలిగారు.
ప్రమాదకరం కూడా
ఉక్రెయిన్ ఐటీ ఆర్మీకి టెలిగ్రామ్‌లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వీరందరి నుంచి రష్యన్ సేనల్ని రిలువరించగలిగే నిఘా సమాచారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని ఓ ఉక్రెయిన్ సైబర్ నిపుణుడు చెప్పారు. ఈ స్థాయిలో ఐటీ వలంటీర్లు పనిచేయడం కూడా అంత శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు. ఓ గుర్తు తెలియని సంస్థ ఇప్పటికే రష్యన్ ఉపగ్రహాన్ని హ్యాక్ చేసినట్టు ప్రకటించిందని, అందులో వాస్తవం లేనప్పటికీ ఇది ప్రమాదకర చర్య అని హెచ్చరించారు. ఇది భీకర యుద్ధానికి దారి తీయడమే కాక, అంతరిక్షాన్ని దుర్వినియోగం చేసినట్టవుతుందని హెచ్చరించారు.
రష్యా కూడా సైబర్ దాడుల యత్నం
మరోవైపు రష్యా కూడా సైబర్ దాడుల స్థాయిని పెంచుతోంది. ఉక్రెయిన్ వెబ్‌సైట్ల ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. ఐరోపాలో శుక్రవారం అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. విద్యుత్ సరఫరా దెబ్బతిన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈమెయిళ్ల ద్వారా వైరస్‌లను చొప్పించి ఆయా పరికరాలు పనిచేయకుండా చేస్తున్నారు.

Ukraine launches Digital Army against Russia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News