వాషింగ్టన్ : అమెరికాలో కరోనా రోగులకు అత్యవసరంగా ప్లాస్మా చికిత్స అందించడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అనుమతించింది. అమెరికాలో దాదాపు 70 వేల మంది కరోనా రోగులు ప్లాస్మా థెరపీతో చికిత్స పొందినట్టు ఎఫ్డిఎ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మా సేకరించి ఈ చికిత్స చేస్తారు. ఎఫ్డిఎ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. చైనా వైరస్కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న తరుణంలో ఈ చారిత్రక ప్రకటన చేస్తున్నానని, దీనివల్ల అనేక జీవితాలకు రక్షణ కల్గుతుందని ట్రంప్ ప్రకటించారు. రాజకీయ కారణాల వల్ల వ్యాక్సిన్లు, వైద్య విధానాల నుంచి ఎఫ్డిఎ పాత్ర వైదొలగుతోందని విమర్శించిన మరునాడే ఎఫ్డిఎను ఇప్పుడు ట్రంప్ ప్రశంసించడం గమనార్హం. ఆస్పత్రుల్లో ఉన్న కరోనా రోగులకు అత్యవసరవైద్యం కింద ప్లాస్మా థెరపీని వినియోగించ వచ్చని ఎఫ్డిఎ ప్రకటించింది. శాస్త్రీయ ఆధారంగా ఈ విధానం కరోనా చికిత్సలో సమర్ధంగా పనిచేస్తుందని తేలిందని పేర్కొంది.
ప్లాస్మా థెరపీని అత్యవసరంగా వినియోగించడానికి ఎఫ్డిఎచే అంగీకరింప చేయడం ట్రంప్ చేసిన ప్రయత్నాల్లో ఇదో గొప్ప మైలురాయిగా హెల్తు అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజార్ ప్రశంసించారు. ఏ దేశంలో లేనంతగా తమ దేశం లోని దాదాపు 70 వేల మంది రోగులకు ప్లాస్మా థెరపీ అందించడంలో తాము చేసిన ప్రయత్నం ఫలించిందని, ఈ మేరకు ప్లాస్మా దాతలకు తాము కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని అజార్ చెప్పారు. ఈ ప్లాస్మా థెరపీ వల్ల రోగుల్లో 35 శాతం వరకు మరణాల రేటును తగ్గించడం కనిపించిందని వివరించారు. అయితే వైట్హౌస్ కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ సభ్యులు ఆంథోనీ ఫాసీ ప్లాస్మా థెరపీ అథ్యయనంలో సామర్ధంపై పరిమితులు వెల్లడించారు.
US allows to Plasma treatment for Corona patients