కొలిజియమ్ సిఫార్సుల కోసం ప్రభుత్వం నిరీక్షణ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో ఏడు రెగ్యులర్ జస్టిస్ల స్థానాలు ఖాళీగా ఉండగ, రెండు హైకోర్టులు అసలు రెగ్యులర్ చీఫ్ జస్టిస్లు లేకుండా పనిచేస్తున్నాయి. మరో రెండు హైకోర్టుల చీఫ్ జస్టిస్ వచ్చే నెల రెండు నెలల్లో రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సుప్రీం కోర్టు కొలీజియం నుంచి సిఫార్సుల కోసం ప్రభుత్వం నిరీక్షిస్తోంది. సుప్రీం కోర్టులో జస్టిస్ రంజన్ గొగొయి 2019 నవంబర్లో చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినతరువాత జస్టిస్లు దీపక్ గుప్తా, ఆర్. భానుమతి, అరుణ్ మిశ్రా, ఇందు మల్హోత్రా, ఎస్ఎ బోబ్డే, వీరంతా రిటైర్ అయిన తరువాత కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. 34 మంది జడ్జిలు నియామకం కావలసి ఉండగా, ప్రస్తుతం 27 మందితోనే సుప్రీం కోర్టు పనిచేస్తోంది. ఈ నెల తరువాత చత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ కానున్నారు. హిమాచల్ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జూన్లో రిటైర్ కానున్నారు.
దేశం లోని మొత్తం 25 హైకోర్టుల్లో 1080 మంది జడ్జిల నియామకానికి మంజూరు అయినప్పటికీ ఖాళీలు భర్తీకాక, కేవలం 660 మంది జడ్జిల తోనే కోర్టులు నడుస్తున్నాయి. ఈ నియామకాల విధానం ప్రకారం సుప్రీం కోర్టు కొలిజియమ్ ఆయా జడ్జిల పేర్లను ప్రభుత్వానికి సిఫార్సులు చేయవలసి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఆమోదించడమో లేక తిరిగి ఆలోచించాలని తిప్పి పంపడమో చేస్తుంది. హైకోర్టు కొలీజియమ్స్ మొదట తమ సిఫార్సులను న్యాయమంత్రిత్వశాఖకు పంపుతారు. దీనికి ఇంటెలిజెన్స్ నివేదికలు జత చేసి సుప్రీం కోర్టు కొలిజియమ్కు పంపుతారు. సుప్రీం కోర్టు కొలిజియమ్ చీఫ్ జస్టిస్తోపాటు నలుగురు సీనియర్ జడ్జిలతో కూడుకుని ఉంటుంది.