హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల
ఎంఎల్సి స్థానానికి మాజీ ప్రధాని కుమార్తెకు అభ్యర్థిత్వం
ఆదివారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
రేపటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం
తిరుగులేని గెలుపే లక్షంగా పట్టభద్రుల నియోజక వర్గాలకు టిఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు
మార్చి 14న పోలింగ్ 17న ఓట్ల లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజికవర్గం ఎంఎల్సి స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఖరారు చేశారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 1, 1952లో జన్మించిన వాణీదేవి, హైదర్గూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో 1968లో హెచ్ఎస్సి పూర్తి చేశారు. ఆ తర్వాత 1970లో రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి(ఆర్బివిఆర్ఆర్) నుంచి పియుసి చేశారు.అనంతరం 1973లో ఉస్మానియా యూనివర్సిటీ బి.ఎ చేసి, 1986లో జెఎన్టియు నుంచి ఫైన్స్ ఆర్ట్లో డిప్లొమా చేశారు. శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యాసంస్థలను నెలకొల్పారు. 1990 నుంచి 1995 వరకు జెఎన్టియులో లెక్చరర్గా పనిచేసిన వాణీదేవి, 1997 నుంచి 2008 వరకు శ్రీ వెంకటేశ్వర్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కళాశాలకు లెక్చరర్గా పనిచేశారు. 2008 నుంచి ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు.
ఉత్కంఠకు తెర
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్సి స్థానానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పట్టభద్రుల ఎంఎల్సి నామినేషన్ల మంగళవారం ముగియనుండగా, ఆదివారం సాయంత్రం టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధానిమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఆశావహులు ఎంఎల్సి టికెట్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిహెచ్ఎంజి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు టిఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా సిఎం కెసిఆర్ వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రస్తుత సిట్టింగ్ ఎంఎల్సి పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.
Vanadevi Contest as TRS graduate MLC Candidate