కొవిడ్ వల్ల మరణించిన బిజెపి కుటుంబాలను పరామర్శించనున్న మాజీ సిఎం
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే నాలుగురోజుల పర్యటనను మంగళవారం ప్రారంభించారు. రాజే పర్యటన మేవర్మేర్వాఢ్ ప్రాంతాల్లోని ఆరు జిల్లాల్లో సాగనున్నది. పర్యటనలో భాగంగా ఆలయాల్లో పూజలు నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతాల్లో కొవిడ్19 వల్ల మృతి చెందిన బిజెపి కుటుంబాలను పరామర్శిస్తారని ఆమె సన్నిహితులు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బిజెపిలో ఆమె పలుకుబడి తగ్గిందన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. అయితే, తన పర్యటనను రాజకీయంగా చూడొద్దని వసుంధర అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభం నుంచీ తాను ధర్మనీతినే నమ్మానని, రాజనీతిని కాదని వసుంధర అన్నారు.
మొదటిరోజున వసుంధర చిత్తోర్గఢ్ఉదయ్పూర్ హైవేలోని శాన్వాలియా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తన కోడలు గత 10 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, శాన్వాలియాసేథ్ ఆశీర్వాదాలతో ఆమె కోలుకుంటున్నారని వసుంధర తెలిపారు. తన సహచరుల కుటుంబాలను పరామర్శించడంలో ఆలస్యానికి కారణాన్ని ఆమె వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందేలా దీవించమని సేథ్ను ప్రార్థించానని ఆమె తెలిపారు.
ఈ ఏడాది మే నెలలో కొవిడ్ వల్ల మరణించిన ధరియావాడ్ ఎంఎల్ఎ గౌతమ్లాల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇటీవల ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందగా, బిజెపి అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. బాన్స్వారాలోని త్రిపురసుందరి ఆలయంతోపాటు మరికొన్ని ఆలయాలను వసుంధర తన పర్యటనలో సందర్శించనున్నారు. శుక్రవారం అజ్మేర్ దర్గాను సందర్శించడంతో ఆమె పర్యటన పూర్తి కానున్నది. తన పాలనలో రాష్ట్రంలోని 125 ఆలయాల అభివృద్ధి కోసం రూ.550 కోట్లు ఖర్చు చేశానని వసుంధర తెలిపారు.