వరుస వర్షాలే కారణం అంటున్న అధికారులు
హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కూడా అందరికి అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య మధ్యతగతికి చెంది వినియోగదారులు విలవిలాడిపోతున్నారు. ఒక వైపు కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నవారు.. మరో వైపు ఉద్యోగాలు చేస్తున్నా సగం వేతనంతో జీవితాలను భారం వెళ్ళుదీస్తున్న సమయంలో కూరగాయల ధరలు కూడా పెరగడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా నిన్నమొన్నటి దాక అందరికి అందుబాటులో ఉన్న టమాట ధరలు మరింతగా పెరిగాయి. లాక్డౌన్ కాలంలో రూ.15 ఉన్న టమాట ధర ప్రస్తుతం రైతు బజార్లో కిలో రూ.41 ఉండగా బహిరంగ మార్కెటల్లో రూ.65 నుంచి 70 పలుకుతోంది.
రెండు నెలల క్రితం వరకు రూ.20 ఉన్న ఆలూ రైతు బజార్లో రూ. 40 ఉండగా బహిరంగ మార్కెట్లో కిలో రూ.60 వరకు పలుకుతోంది. ఇలా ఏది చూసినా కిలో బహిరంగ మార్కెట్లో కిలో రూ. 40 నుంచి 60కి తక్కువగా ఉండటంతో లేదు. చిక్కుడు రకాలన్నీ సామాన్యుడికి చిక్కె పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విధంగా కూరగాయలన్నీ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్ అధికారులు నిర్ణయించిన ధరలు మాకు గిట్టుబాటు కావడం లేదని రైతుల పేరిట వ్యాపారాలు సాగిస్తున్న దళారులు మొండికేస్తున్నారు.
వరుస వర్షాలే కారణం …
గత నెలలో అల్పపీడనం కారణంగా ఎడతెరపి లేని వర్షాలు కురవడంతో చేతికి రావాల్సిన పంట అందక పోవడమే ధరల పెరుగుదలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నగరానికి పెద్దమొత్తంలో కూరగాయలు సరఫరా అయ్యే వికారాబాద్, పరిగి, మోయినబాద్ చేవెళ్ళ తదితర ప్రాంతాల్లో అధిక మొత్తంలో వర్షం కురవడంతో పంటలునీటి మునిగిపోయాయి. అధిక వర్షాలకారణంగా టమాట పంటకు మచ్చలు, ఏర్పడటం, కాయతొలిచే పురుగ పట్టడంతో దాని ధర అందుబాటులో లేదు. అంతే కాకుండా తీగల పంటలైన చిక్కుడు, దోసకాయ, సొరకాయలు తదితర పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని అధికారులు చెబుతున్నారు.