షార్జా: మహిళల ఐపిఎల్లో వెలోసిటి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మొదటి మ్యాచ్లో వెలోసిటి ఐదు వికెట్ల తేడాతో సూపర్ నొవాస్ను ఓడించింది. 127 పరుగుల లక్ష్యాన్ని వెలోసిటి మరో బంతి మిగిలివుండగానే ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన వెలోసిటికి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డానిల్లి వ్యాట్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. ఏడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. ధాటిగా ఆడిన మరో ఓపెనర్ షఫాలి వర్మ 4 ఫోర్లతో వేగంగా 17 పరుగులు చేసింది. అయితే దూకుడు మీద కనిపించిన షఫాలిను ఖాకా ఔట్ చేసింది. దీంతో వెలోసిటి 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఇన్నింగ్స్ను కుదుట పరిచే బాధ్యతను వేదా కృష్ణమూర్తి, వికెట్ కీపర్ సుష్మా వర్మ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వేదా 4 ఫోర్లతో 29 పరుగులు సాధించింది. మరోవైపు సుష్మా రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసింది. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సునే లూస్ 21 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 37 పరుగులు చేసి జట్టును గెలిపించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నొవాస్ 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆటపట్టు (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31) మాత్రమే కాస్త రాణించారు.
Velocity win by 5 wickets against Supernovas