హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విఠల్ మరణ వార్త తెలియడంతో సోమవారం రాత్రి హుటాహుటీన ఆయన విజయవాడకు చేరుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని విఠల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గట్టిగా తన వాదనను వినిపించారన్నారు.
తెలంగాణ ప్రజలను చైతన్య పరచడంలో విఠల్ కీలక పాత్ర పోషించారన్నారు. మానవీయ స్పర్శతో రోగాన్ని నయం చేయడం ఆయనకే చెందుతుందన్నారు. విఠల్ నాడిని పట్టి రోగం నయం చేసిన వైద్యుడని, వైద్యాన్ని వాణిజ్యంతో కాకుండా సేవా భావనతో చూసిన వైద్యుడని మంత్రి కొనియాడారు. ప్రజా వైద్యశాలకు అంకురార్పణ చుట్టిన మహనీయులు, నమ్మిన సిద్ధాంతం కొరకు చివరి వరకు నిలబడిన నేత విఠల్ అని మంత్రి పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వర్లు, నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సం
ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన సిపిఐ పార్టీ
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, సూర్యాపేట, విజయవాడలో ప్రజా వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ ఎపి విఠల్ అకాల మృతిపై సిపిఐ పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి, పేద ప్రజ లకు తీరనిలోటని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. కామ్రేడ్ విఠల్ గొప్ప రాజనీతిజ్ఞుడని, సిద్ధాంతకర్త అని ఆయన పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభ్యుదయ కమ్యూనిస్టుగా పేర్కొందిన కామ్రేడ్ విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన కొనియాడారు. విఠల్ ఉన్నన్నీ రోజులు నిరాడంబర జీవనం కొనసాగించారన్నారు. విఠల్ కుటుంబసభ్యులకు చాడ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.