Thursday, May 9, 2024

ఈ నెల నుంచే పెంచిన జీతాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్ -కమ్ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పెంచిన వేతనాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గతంలో రూ.వెయ్యి గౌరవ వేతనం ఇస్తుండగా, దానిని రూ.3 వేలకు పెంచుతూ గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నెల నుంచి పెంచిన వేతనాలను అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

శనివారం నాడు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా బాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తొలిమెట్టును విజయవంతంగా అమలుచేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తున్నామని చెప్పారు.

వారంలోగా యూనిఫాం అందకపోతే బాధ్యులపై చర్యలు
పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నామని వివరించారు.పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్షలు సమీపించిన తర్వాత తొందరపడటం కంటే, ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని కోరారు.

మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోటి రూపాయల కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News