Thursday, May 9, 2024

ఏడేళ్ల పహాణీల కోసం ఎదురుచూపు !

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర డేటాను ఇవ్వని ఎన్‌ఐసి
ఇబ్బందులు పడుతున్న రైతులు

Correction module available soon in Dharani Portal
మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణకు చెందిన ఏడేళ్ల రికార్డులను ఎన్‌ఐసి (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) రాష్ట్రానికి ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వద్ద ప్రస్తుతం ఈ 7 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో భూ యజమానులకు ఇబ్బంది కలుగుతోంది. 1954, 55 సంవత్సరం నుంచి ప్రతి భూమికి సంబంధించిన పహాణీలే కీలక ఆధారం. ఈ నేపథ్యంలో వీటిని రెవెన్యూ శాఖ పరిగణలోకి తీసుకుంటుంది. అయితే 2003 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం రెవెన్యూ అధికారులు గ్రామ పహాణీలను మాన్యువల్‌గా తయారు చేసేవారు. అయితే 2004 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ పహాణీలను మాన్యువల్ తయారు చేయవద్దని కంప్యూటరైజ్డ్ పహాణీలను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆ సంవత్సరంలో కంప్యూటరైజ్డ్ పహాణీల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మళ్లీ అధికారులు మాన్యువల్‌గానే ఈ పహాణీలను 2011 వరకు చేతితో రాశారు. 2011, 12 సంవత్సరంలో టెక్నికల్ సమస్యలు పరిష్కారం కావడంతో అప్పటి నుంచి కంప్యూటర్‌లో ఈ పహాణీలను నమోదు చేస్తున్నారు.

2011 నుంచి 2018ల మధ్య జరిగిన ఈ ప్రక్రియ అయితే 2011 నుంచి 2018ల మధ్య జరిగిన ఈ ప్రక్రియను జాతీయ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసి) ఆధ్వర్యంలో జరిగింది. 2018 సంవత్సరంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపి) ప్రారంభం కావడంతో అప్పటి నుంచి మిగతా భూ రికార్డులతో పాటు పహాణీలను ఎల్‌ఆర్‌యూపి పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. 2020 సంవత్సరంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఎల్‌ఆర్‌యూపి పోర్టల్ డేటాను ధరణి పోర్టల్‌లోకి బదిలీచేశారు. ఆ సమయంలో ఈ 7 సంవత్సరాల పహాణీల డేటాను ఎన్‌ఐసి వద్దే ఉండిపోయింది. అప్పటినుంచి ఆ డేటాను ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేయకపోవడంతో ఆ డేటా లభ్యం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

భూములను అమ్ముకునే సమయంలో

పహాణీలు భూ రికార్డులకు సంబంధించి కీలకం. బ్యాంకులు ఇచ్చి తనఖా రుణాలు, టైటిల్ క్లియరెన్స్ కోర్టు కేసుల విషయంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. యాజమాన్య హక్కుల కల్పనకు వీటిని మాతృకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పహాణీలకు సంబంధించిన ఏడేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారులతో పాటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మాములుగా బ్యాంకులోన్లు, టైటిల్ క్లియరెన్స్‌కు, కోర్టు కేసులకు సుమారుగా 13 ఏళ్ల పహాణీలే కీలకం అవుతాయి. ప్రస్తుతం భూ రికార్డు, సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్‌లలో ఉండే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హక్కులు సంక్రమించిన విధానం, భూమి రకం లాంటి వివరాలు ఈ ఏడేళ్లకు సంబంధించి కావాలని బ్యాంకు అధికారులు లోన్‌లకు వెళ్లినప్పుడు అడుగుతున్నారని, భూములను అమ్ముకునే సమయంలో వీటిని కొనుగోలు చేసే వారు చూపించమంటున్నారని రైతులు వాపోతున్నారు.

ధరణి పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా

ఈ రికార్డులను ఇవ్వాలని ఎన్‌ఐసిని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆ డేటాను ఇవ్వాలని ఎన్‌ఐసిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ 7 సంవత్సరాల డేటా ఇస్తాం, దానిని మాత్రం తాము స్టోరేజ్ చేయమని అవన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఎన్‌ఐసి తేల్చిచెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై రెవెన్యూ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుత సమయంలో ఈ డేటాను ఆ పోర్టల్‌లో ఎలా భద్రపరచాలన్న దానిపై అధికారులు ఆలోచనలో పడ్డట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News